హిజాబ్ వివాదం: మరికొన్ని గంటల్లో తీర్పు..బెంగళూరులో హై అలర్ట్.. అక్కడ స్కూల్స్ బంద్
హిజాబ్ వివాదంపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఎలా ఉన్నా.. ఇరు వర్గాలను అదుపులో ఉంచడం కోసం అధికార యంత్రాంగం అప్పుడే రంగంలోకి దిగింది. తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కర్ణాటక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు అంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
సెలవులు
హిజాబ్ వివాదం రేగిన దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా మంగళవారం అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరిగే పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని కలెక్టర్ అన్ని విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (మార్చి 15) నుంచి ఈ నెల 21 వరకు బెంగళూరు నగరంలో నిషేధాజ్ఞలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వారం పాటు బెంగళూరు నగరంలో ఎలాంటి సమావేశాలు గానీ, నిరసనలు గానీ, జనం గుమికూడడానికి కానీ అనుమతించబోమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
రావొద్దని చెప్పడంతో..
మంగళూరులో అకస్మాత్తుగా ఒక కాలేజీ నిర్వాహకులు ఐదుగురు ముస్లిం అమ్మాయిలకి హిజాబ్ వేసుకుని కళాశాలకి రావద్దని చెప్పారు. కాలేజీ యూనిఫాం నియమాలకు హిజాబ్ విరుద్ధమని, కనుక ఇలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. సగానికి సగం మంది స్త్రీలని విద్యకు దూరంగా ఉంచే ఈ దేశంలో కాలేజీ విద్యాభ్యాసం వరకూ వచ్చే అమ్మాయిలని, అందులోనూ అణగారిన ముస్లిం సమూహానికి చెందిన అమ్మాయిలని చదువుకి నోచుకోకుండా చెయ్యటానికి ఇదొక విచిత్ర ఎత్తుగడ.
హిజాబ్కే ఎందుకు
పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవి వర్మ కుమార్.. ప్రజలు ప్రతిరోజూ ధరించే దుపట్టాలు, గాజులు, తలపాగాలు, శిలువలు, బొట్టు వరకూ వందలాది మతపరమైన చిహ్నాలు ఉన్నప్పుడు హిజాబ్ను ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారని న్యాయమూర్తులను ప్రశ్నించారు. సమాజంలోని విస్తారమైన అన్ని వర్గాల మతపరమైన చిహ్నాలు వైవిధ్యాన్ని మాత్రమే చూపుతున్నాను.. ప్రభుత్వం ఒక్క హిజాబ్ను ఎందుకు ఎంచుకొని ఈ విద్వేషపూరిత వివక్ష చూపుతోంది? గాజులు ధరించారా? అవి మత చిహ్నాలు కాదా? కేవలం ఈ ముస్లిం అమ్మాయిలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు?.. కేవలం ఆమె మతం కారణంగానే బయటకు పంపుతున్నారు. బొట్టు పెట్టుకున్న అమ్మాయిని బయటకు పంపరు.. గాజులు ధరించిన అమ్మాయి కాదు.. శిలువ ధరించిన క్రైస్తవుడు తాకరు.. ఈ అమ్మాయిలు మాత్రమే ఎందుకు? ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 15ను ఉల్లంఘించడమేనని వాదించారు.
సరికాదు
హిజాబ్ ధరించినందుకు విద్యార్థులను శిక్షించడం లేదా తరగతి గది నుంచి పంపిన సందర్భాలను నిరసించారు. హిజాబ్తో వచ్చినవారిని లోపలికి అనుమతించకుండా మరీ ఇంత క్రూరమైన శిక్షణ విధిస్తారా? వారిని ఉపాధ్యాయులు అని పిలవవచ్చా?.. మతం కారణంగా పక్షపాతం చూపుతున్నారు.. ఎటువంటి నోటీసులేకుండా అధికారం లేని వ్యక్తుల ద్వారా బయటకు పంపుతున్నారని అన్నారు.