Rohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలు
బెంగళూరు: విధి నిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక కేడర్ తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. రోహిణి సింధూరి పనితీరును తప్పుపడుతూ తోటి ఐఎఎస్ అధికారిణి ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. తానీ నిర్ణయం తీసుకోవడానికి రోహిణి సింధూరే కారణమంటూ బాంబు పేల్చారు. తనను టార్గెట్గా చేసుకున్నారని, ప్రతి రోజూ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Gas leak: కెమికల్ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు: ఉలిక్కిపడ్డ జనం: ఉరుకులు పరుగులు
చామరాజనగర మరణాల్లోనూ..
2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్కు చెందిన రోహిణి సింధూరి ప్రస్తుతం మైసూరు జిల్లా కలెక్టర్గా పనిచేస్తోన్నారు. కొద్దిరోజుల కిందటే చామరాజనగర జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది మరణించిన ఉదంతంలోనూ రోహిణి సింధూరి పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో చామరాజనగర జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంఆర్ రవి.. రోహిణి సింధూరిపై ఆరోపణలు చేశారు. చాలినంత ఆక్సిజన్ సరఫరా చేయడంలో అలసత్వం ప్రదర్శించారంటూ ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన కర్ణాటక న్యాయస్థానం.. ఆ ఘటనలో రోహిణి సింధూరి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది. ఉద్దేశపూరకంగానే ఎం ఆర్ రవి ఆమెపై ఆరోపణలు చేసినట్లు నిర్ధారించింది.
తోటి ఐఎఎస్ అధికారిణి రాజీనామా..
ఈ ఘటన ముగిసిన మూడు వారాల వ్యవధిలోనే రోహిణి సింధూరి చుట్టూ మరో వివాదం ముసురుకుంది. డిప్యూటీ కమిషనర్ (కలెక్టర్) హోదాలో ఆమె తనపై రోజూ ప్రభుత్వానికి, ఉన్నతాదికారులకు ఫిర్యాదు చేస్తున్నారంటూ మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్, ఐఎఎస్ అధికారిణి శిల్పా నాగ్ ఆరోపించారు. విధి నిర్వహణలో తనపై రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఆమె వేధింపులు భరించలేక ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2014 బ్యాచ్ ఐఎఎస్ అధికారిణి శిల్పా నాగ్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మైసూరు సిటీ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు.
కారణాలేంటీ?
జిల్లాలో అధికారులెవరూ స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం లేదని ఆమె ధ్వజమెత్తారు. తన సర్వీసుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామా లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించానని వివరించారు. తనను వెంటనే రిలీవ్ చేయాలని కోరినట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని.. వ్యక్తిగత కక్షను తీర్చుకోవడానికే రోహిణి సింధూరి తనను వేధింపులకు గురి చేస్తోన్నట్లు శిల్పా నాగ్ అన్నారు.
Recommended Video
ప్రభుత్వం చెబుతోంది?
మైసూరు సిటీ కార్పొరేషన్ పరిధిలో కరోనా వైరస్ గణనీయంగా తగ్గిందని, అధికారుల పనితీరే దీనికి కారణమంటూ మీడియాలో వార్తలొచ్చినప్పటి నుంచీ తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆమె చేసిన ఆరోపణలపై రోహిణి సింధూరి స్పందించారు. శిల్పా చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం కాదని అన్నారు. కాగా- శిల్పా నాగ్ రాజీనామాను తాము ఆమోదించాలని అనుకోవట్లేదని మైసూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్టీ సోమశేఖర తెలిపారు. ఆమె పనితీరు పట్ల తమ ప్రభుత్వం సంతృప్తికరంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను శిల్పాను కలిసి మాట్లాడుతానని, ఆ తరువాతే ఏ చర్య తీసుకోవాలనేది నిర్ణయిస్తామని అన్నారు.