ప్రతిష్ఠాత్మక హిందూ మఠాధిపతిగా ముస్లిం వ్యక్తి: లింగధారణ..రుద్రాక్షమాల: ఆయన బోధనలతో స్ఫూర్తి.. !
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ప్రతిష్ఠాత్మక మఠానికి అధిపతిగా ఓ ముస్లిం వ్యక్తి నియమితులయ్యారు. ఆయన పేరు దివాన్ షరీఫ్ రహీమన్సాబ్ ముల్లా. వయస్సు 33 సంవత్సరాలు. కర్ణాటకలోని గదగ్ జిల్లా అసూతిలో గల శ్రీమురుఘ రాజేంద్ర కోరణేశ్వర శాంతిధామ మఠాధిపతిగా ఆయన నియమితులయ్యారు. మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన ఇష్ట లింగధారణ చేశారు. దీని తరువాతే ఆయనకు మఠం బాధ్యతలను అప్పగించారు.
కర్ణాటకలో మెజారిటీ సామాజిక వర్గమైన లింగాయత్లకు చెందిన మఠం అది. ఈ మఠాధిపతిగా బాధ్యతలను స్వీకరించాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటననింటినీ రహీమన్సాబ్ ముల్లా పాటించారు. దీనికోసం తల నీలాలను సమర్పించారు. తలకు కాషాయ తలపాగాను ధరించారు. శివలింగంతో కూడిన రుద్రాక్షమాలను ధరించారు. శివస్తుతిని పఠించారు. అనంతరం ఆయనకు మఠాధిపతి బాధ్యతలను అప్పగించారు.

కర్ణాటకకకు చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడి బోధనల నుంచి తాను స్ఫూర్తిని పొందానని రహీమన్సాబ్ తెలిపారు. తన తల్లిదండ్రులు కోరణేశ్వర స్వామి భక్తులని పేర్కొన్నారు. ముందు నుంచీ తాను మతాలకు అతీతంగా ఉండేవాడినని, మసీదుకు వెళ్లినట్లే ఆలయానికి కూడా వెళ్లేవాడినని అన్నారు. చాలాకాలం నుంచి తాను బసవేశ్వరుడి బోధనలను అనుసరిస్తున్నానని చెప్పుకొచ్చారు. లింగాయత్ మఠం.. కుల, మతాలకు అతీతంగా సామాజిక సేవలను అందిస్తోందని, దాన్ని కొనసాగిస్తానని అన్నారు.

ఇష్ట లింగధారుణ చేయాలంటూ తనను ఎవరూ బలవంత పెట్టలేదని, ఇష్టపూరకంగానే తాను లింగధారణ చేశానని చెప్పారు. తాను లింగధారణ చేయడం పట్ల ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని, వాటిని తాను ఏ మాత్రం పట్టించుకోవట్లేదని అన్నారు. సంఘ సంస్కర్త బసవేశ్వరుడు చూపిన బాటలో నడుస్తానని, ఆయన బోధనలను వ్యాపింపజేస్తానని చెప్పారు. మఠం తరపున సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నటమ్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications