అవి స్కూల్స్ కాదు.. వ్యభిచార కేంద్రాలు : కర్ణాటక మంత్రి ఆంజనేయ
కర్ణాటక : ప్రైవేటు యాజమాన్యాలు విద్యా వ్యవస్థలోకి చొరబడ్డ తర్వాత.. సామాన్యులకు చదువు'కొందా'మంటే కూడా దొరకని పరిస్థితి. తాజాగా ప్రైవేటు యాజమాన్యాల అడ్డగోలు ఫీజులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కర్ణాటక సాంఘీక శాఖా మంత్రి హెచ్.ఆంజనేయ. అయితే శృతిమించిన ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని చెప్పుకొచ్చిన మంత్రి ఆంజనేయ.. ప్రైవేటు విద్యా సంస్థల వ్యవహారం వ్యభిచార కేంద్రాల లాగా తయారైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవి పాఠశాలలు కాదు, అధిక ఛార్జీలు వసూలు చేసే వ్యభిచార కేంద్రాలంటూ ప్రైవేటు విద్యా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధిక సంపాదనరకు ఆశపడి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే, అన్ని ప్రైవేటు విద్యా సంస్థలను తప్పు పట్టలేమని, కొన్ని మంచి విద్యా సంస్థలు కూడా ఉన్నాయన్నారు మంత్రి ఆంజనేయ. కాగా.. మంత్రి ఆంజనేయకు సీఎం సిద్దరామయ్య ముఖ్య అనుచరుడన్న పేరుంది. దీంతో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు మంత్రి కామెంట్స్ పై తీవ్రంగా స్పందించాయి.
మంత్రి ఆంజనేయ క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నాయి కర్ణాటకలోని ప్రైవేటు విద్యా సంస్థలు. దీనిపై స్పందించిన సీబీఎస్ఈ స్కూల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలీఖాన్.. మంత్రి స్థానంలో కొనసాగుతున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఖచ్చితంగా మంత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం సిద్ద రామయ్యను డిమాండ్ చేశారు.