బెంగళూరు తెలివి: కుక్క కరిస్తే కేన్సర్ బిల్లు క్లైమ్
బెంగళూరు: బెంగళూరు నీళ్లు తాగితే వారికి ఎక్కడలేని తెలివి వచ్చేస్తుంది. కుక్క కరిచినందుకు ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తరువాత కేన్సర్ వ్యాదికి చికిత్స చేయించుకున్నామని బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు తీసుకుని స్వాహా చేశారు.
ఇలాంటి స్కామ్ లు చేసిన నలుగురిని కర్ణాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు వందకు పైగా ఇలాంటి ఫోర్జరీ బిల్లులు పెట్టి ఏకంగా రూ. 3 కోట్లు స్వాహా చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బంది, ఆసుపత్రుల ఉద్యోగులకు ఈ స్కాంతో సంబంధం ఉందని పోలీసులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని 30 ప్రముఖ ఆసుపత్రులలో ఈ తతంగం జరిగిందని వెలుగు చూసింది.
ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి మెడికల్ బిల్లుల్లో తేడా ఉండటం గమనించారు. తరువాత అనుమానం వచ్చి విదాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సీఐడీకి బదిలి చేశారు.
కేసు దర్యాప్తు చేస్తే మొత్తం డొంకంతా కదిలింది. సీఐడీ పోలీసులు ఈ కుంబకోణంతో సంబంధం ఉన్నతిప్పన్న, సీఎం. నాగరాజశెట్టి, శంకర్ సిద్దశెట్టి, ఎం.కే. కిరణ్ అనే నలుగురిని అరెస్టు చేశారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 54 కేసులు నమోదు అయ్యాయి. అరెస్టు అయిన వారిలో తిప్పన్న వేర్వేరు పేషెంట్ల పేరుతో ఏకంగా 75 బిల్లులు పెట్టారని పోలీసులు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి కార్యాలయం సిబ్బందిని విచారిస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు.