కర్ణాటక: బజరంగ్ దళ్ కార్యకర్త హత్య విషయంలో పోలీసులకు, బీజేపీ నేతల మధ్య భిన్న వాదనలు

Click here to see the BBC interactive

''బజరంగ్ దళ్ సంస్థలో నా సోదరుడు క్రియాశీల సభ్యుడు. కేవలం హిందువుల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అందుకే తనను హత్య చేశారు.''

కర్ణాటకలోని షిమోగాలో ఆదివారం రాత్రి కత్తి దాడిలో బజరంగ్ దళ్ సభ్యుడు, 26 ఏళ్ల హర్ష మరణించారు. హిందువుల కోసం గొంతెత్తినందుకే హర్షను హత్య చేశారని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని హర్ష సోదరుడు ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నారు.

ప్రవీణ్ ఒక్కరే ఇలాంటి ఆరోపణలు చేయడం లేదు. బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నేతలతో పాటు కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎంపీలు కూడా దీనిపై ఘాటుగా స్పందిస్తున్నారు.

హిజాబ్‌తో పాటు జాతీయ జెండా గురించి కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన ప్రకటనలతో చెలరేగిన వివాదాల నడుమ షిమోగాలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగింది. దీనికి ప్రతిగా చెలరేగిన హింసాత్మక వాతావరణం దేశమంతటా చర్చనీయాంశమైంది.

''దర్యాప్తులో హిజాబ్ వివాదం కారణంగానే ఈ హత్య జరిగినట్లు ఆధారాలేమీ దొరకలేదు. అయితే అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం'' అని కర్ణాటక పోలీస్ శాఖ తెలిపింది.

బీజేపీ, బజరంగ్ దళ్ మాత్రమే కాకుండా మిగతా హిందుత్వ సంస్థలు కూడా ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అదే సమయంలో రాష్ట్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య వాగ్యుద్ధం కూడా కొనసాగుతోంది.

షిమోగాలో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని మంగళవారం కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసు అధికారులు చెప్పినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

షిమోగాలో శాంతి పరిస్థితులను పరిరక్షిస్తున్నామని కర్ణాటక యువజన ఉపాధి, క్రీడా మంత్రి కేసీ నారాయణ గౌడ చెప్పారు. ''త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని, ప్రజలు ఆందోళన చెందకూడదని'' సూచించారు.

హత్యకు గురైన బజరంగ్ దళ్ సభ్యుడు హర్ష సోదరుడు ప్రవీణ్

ఉద్రిక్త వాతావరణం

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం కూడా పాఠశాలలు, కాలేజీలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. సోమవారం కూడా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

ఆవేశంతో రగిలిపోతున్న సమూహాలను అదుపులోకి తీసుకురావడానికి సోమవారం పోలీసులు లాఠీచార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపారు. నగరంలో ప్రతీచోటా పోలీసు బలగాలను మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని ప్రజలను జిల్లా యంత్రాంగం అభ్యర్థించింది.

హత్యకు సంబంధించి మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. కర్ణాటక హోంమంత్రి అర్గ జ్ఞానేంద్ర సోమవారం ముగ్గురి అరెస్ట్ గురించి చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొంతమంది వ్యక్తులు ఆదివారం రాత్రి కత్తితో బజరంగ్ దళ్ కార్యకర్త హర్షపై దాడి చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు.

తమకు న్యాయం కావాలంటూ హర్ష కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి జ్ఞానేంద్ర చెప్పారు.

''దోషులకు కఠిన శిక్ష విధించడమే మాకు కావాలి'' అని హర్ష సోదరుడు ప్రవీణ్ అన్నారు.

https://twitter.com/ANI/status/1495982939246821379

నేరస్థులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.

హిజాబ్ వివాదం?

అయితే, ఈ ఘటనకు హిజాబ్ వివాదమే కారణమని పలువురు బీజేపీ నేతలతో పాటు హిందుత్వ సంస్థలు ఆరోపిస్తున్నాయి. హిజాబ్ వివాదంతో షిమోగాలో ఉద్రిక్తత నెలకొంది.

''విద్యా సంస్థల్లో హిజాబ్‌ను హర్ష వ్యతిరేకించారు. అందుకే జిహాదీలు ఆయన ప్రాణం తీశారు'' అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఆరోపించినట్లు పీటీఐ పేర్కొంది.

అంతకుముందు, రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్ కూడా హర్ష హత్య వెనుక హిజాబ్ వివాదం ప్రమేయం ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

https://twitter.com/ANI/status/1495786905962696705

బీజేపీ నేతల వాదనలకు, కర్ణాటక పోలీసుల విచారణకు ఏమాత్రం పొంతన ఉండట్లేదు.

హర్ష హత్య కేసులో అరెస్టయిన వారు ఏ సంస్థకు చెందినవారు? వారి వివరాల గురించి ప్రశ్నించగా కర్ణాటక పోలీస్ ఏడీజీపీ ప్రతాప్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

''దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే కేసు ఒక కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత దీని గురించి కోర్టుకు నివేదిస్తాం. నిందితులు అందర్నీ గుర్తించాం. షిమోగా జిల్లా వ్యాప్తంగా పోలీసు బలగాలు వారికోసం గాలిస్తున్నాయి. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం'' అని ఆయన తెలిపారు.

ఈకేసును, ఎన్‌ఐఏకు అప్పగించాలని పలువురు బీజేపీ నేతులు డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఎం.పి. రేణుకాచార్య, హర్ష కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.

https://twitter.com/ANI/status/1496001755376922626

హర్ష హత్య వెనుక కాంగ్రెస్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. డీకే శివశంకర్, బీకే హరిప్రసాద్, ఇతర కాంగ్రెస్ నేతల పాత్రపై సందేహం వ్యక్తం చేశారు.

అంతకుముందు కేంద్ర మంత్రి శోభా కరాందలాజ్ కూడా ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

'ఈశ్వరప్ప ప్రజలను రెచ్చగొట్టారు'

మరోవైపు సోమవారం హర్ష అంతిమయాత్ర సందర్భంగా తలెత్తిన హింసాత్మక వాతావరణానికి కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు మంత్రి కేఎస్ ఈశ్వరప్ప బాధ్యులని కాంగ్రెస్ ఆరోపించింది.

''షిమోగాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంది. కానీ ఈశ్వరప్ప దాన్ని ఉల్లంఘించారు. అంతిమయాత్ర ఊరేగింపును ఆయన దగ్గరుండి నడిపించారు. రెచ్చగొట్టే పరిస్థితుల్ని కల్పించారు. ముందుగా ఆయనపై కేసు నమోదు చేయాలి'' అని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అన్నారు.

ఈశ్వరప్ప, షిమోగా ఎమ్మెల్యే. కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి కూడా. హర్ష హత్య జరిగిన తర్వాత, ఈ ఘటన వెనుక 'ముస్లిం గుండాల పాత్ర ఉందని' ఆయన అన్నారు.

ఈశ్వరప్పను హోం మంత్రి జ్ఞానేంద్ర సమర్థించారు.

https://twitter.com/ANI/status/1496031151072620546

''షిమోగా ప్రశాంతంగా ఉంది. హర్ష పార్థివదేహం ఊరేగింపును ఈశ్వరప్ప నడిపించలేదు. స్థానిక ఎమ్మెల్యే హోదాలో ఆయన అక్కడ ఉన్నారు. ఆస్తికి నష్టం కలిగించిన వారిపై చర్య తీసుకుంటాం'' అని అన్నారు.

'' హర్ష అంతిమ యాత్ర సందర్భంగా జరిగిన రాళ్ల దాడి, హింస, విధ్వంస కాండలో ఒక ఫొటో జర్నలిస్ట్, ఒక మహిళా పోలీసుతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పలు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేయడంతో పాటు తగులబెట్టారు'' అని పోలీసు అధికారులు తెలిపినట్లు పీటీఐ పేర్కొంది.

జెండాపై ఈశ్వరప్ప చేసిన ప్రకటనతో వివాదం

బీజేపీ మంత్రి ఈశ్వరప్ప, జెండాకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. ఈ విషయమై మంగళవారం అసెంబ్లీలో కూడా దుమారం చెలరేగింది.

దీంతో కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. ఈశ్వరప్పకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనలు చేశారు. ''ఎర్రకోటపై జాతీయ జెండా స్థానంలో కాషాయ జెండా ఎగురుతుందని'' ఈశ్వరప్ప వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

''ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన చేసింది. ఆయన వ్యాఖ్యలు జాతీయ జెండాను అవమానించేలా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇది చాలా తప్పు, బాధ్యతారాహత్య ప్రకటన'' అని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అన్నారు.

ఈ అంశంపై ఈశ్వరప్ప స్పందించారు.

''జేపీ నడ్డా మా జాతీయ అధ్యక్షుడు. ఆయన చెప్పినది వినడమే మా విధి. నేను ఏం అన్నానో మీకు తెలుసు. నేను ఆయనను (నడ్డా) గౌరవిస్తాను. కానీ నేను మాట్లాడిన దానిలో తప్పు ఉందా? లేదా? అనే అంశంపై మా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమాధానం ఇచ్చారు'' అని ఈశ్వరప్ప చెప్పారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో షిమోగా ఎమ్మెల్యే ఈశ్వరప్ప ఎప్పుడూ చర్చల్లో నిలుస్తారు. షిమోగాలో హిజాబ్ సందర్భంగా కూడా ఉద్రిక్తత నెలకొంది.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+