యడియూరప్ప నెత్తిన పాలు పోసిన స్పీకర్..!? రెబెల్స్పై వేటు.. వాట్ నెక్స్ట్?
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రాష్ట్ర భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు బీఎస్ యడియూరప్ప నెత్తిన స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ పాలు పోశారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) సహా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. ఫిరాయింపుల నిరోధక చట్గం ప్రకారం.. వారిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు విధానసౌధలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలి దశలో ముగ్గురు, ఆ తరువాత 14 మందిపై అనర్హత వేటు పడింది. మొత్తం 17 మంది అనర్హత వేటుకు గురి కావడం ముఖ్యమంత్రి యడియూరప్ప నెత్తిన పాలు పోసినట్టయింది.
కర్ణాటక శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 225. ఇందులో 17 మందిపై అనర్హత వేటు పడింది. మొత్తం సభ్యుల బలం 208కి క్షీణించింది. ఫలితంగా- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ సైతం 112 నుంచి 103కు దిగజారింది. ఈ రకంగా చూస్తే- బీఎస్ యడియూరప్ప బలపరీక్ష నెగ్గడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే భారతీయ జనతాపార్టీకి సభలో 105 మంది సభ్యుల బలం ఉంది. బహుజన్ సమాజ్ వాది పార్టీ సభ్యుడు ఎన్ మహేష్ సైతం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో అధికారాన్ని పోగొట్టుకున్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమికి ఉన్న సభ్యుల బలం 100.
ఇందులో స్పీకర్ రమేష్కుమార్ను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 101కి చేరుతుంది. అయిదు లేదా ఆరుమంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సులువు. ఈ నేపథ్యంలో- సోమవారం కర్ణాటక శాసనసభలో చోటు చేసుకునే బల పరీక్షలో గెలవడం కేవలం లాంఛనప్రాయమే.
కూటమి ముందున్న సవాళ్లేంటీ?
ప్రస్తుతం కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి చేయడానికేమీ లేదు. అంతా చేజారిపోయింది. యడియూరప్ప ప్రభుత్వాన్ని అస్థరిపరచడానికి ప్రయత్నాలు చేయడం ఒక్కటే మిగిలి ఉంది. అదీ అసాధ్యమే. ఎందుకంటే- బీజేపీకి ఉన్న 105 మంది సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి జై కొట్టే అవకాశాలు ఎంతమాత్రమూ లేవు. బీజేపీలో అసమ్మతి అనే జాడే లేదు. ఏకతాటిపై నిల్చున్నారు ఆ పార్టీ సభ్యులంతా. కాంగ్రెస్-జేడీఎస్ ఎంతగా ప్రలోభ పెట్టినప్పటికీ.. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలెవరూ గోడ దూకడానికి సిద్ధంగా లేరు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తుండటం తప్ప చేయడానికి మరేమీ లేదు.
ఉప ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా?
17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు పడటం వల్ల మరో ఆరు నెలల్లో ఆయా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించడం అనివార్యం. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభావం చూపించాల్సి ఉంటుంది. బీజేపీకి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అన్ని స్థానాలను ఈ కూటమి గెలుచుకోగలిగితే- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 15 స్థానాలనైనా కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. బీజేపీకి ఓ తొమ్మిది మంది గెలిచినా ఇక ఢోకా ఉండదు. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను హస్తగతం చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కనాకష్టమే అవుతుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం వీచిన నేపథ్యంలో- ఉప ఎన్నికలపై ఈ కూటమి నేతలకు ఎలాంటి ఆశలూ లేవనే చెప్పుకోవచ్చు.
బీజేపీకి నిశ్చింత..
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో బీజేపీ ఇక ఊపిరి పీల్చుకుంటోంది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ స్వాగతిస్తోంది కూడా. ఉన్న 105కు తోడు బీఎస్పీ సభ్యుడిని కూడా కలుపుకొంటే 106 మంది అవుతారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం కంటే ఓ ముగ్గురు ఎక్కువే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యడియూరప్ప బలపరీక్షను గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిదే. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడం ఆయన ముందున్న అసలు టార్గెట్. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ హవా వీస్తోంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాల్లో 26ను గెలచుకుందా పార్టీ. ఈ ఎన్నికలతో పోల్చుకుంటే- వచ్చే ఉప ఎన్నికలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమే అవుతుంది. ఏ రకంగా చూసినా.. బీజేపీకి ముందున్నది మంచి కాలమే అనిపిస్తోంది.
రెబెల్స్ దారెటు?
ఇక అనర్హత వేటుకు గురైన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరమే. ఎందుకంటే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. అనర్హతకు గురైతే- అయిదేళ్ల వారు ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు ఉండదు. చివరికి శాసన మండలికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యే అవకాశాన్ని వారు కోల్పోయినట్టే. యడియూరప్ప ప్రభుత్వం కనికరిస్తే.. ఏవైనా నామినేటెడ్ పోస్టులు దక్కుతాయే తప్ప అయిదేళ్ల వరకు చట్టసభలో అడుగు పెట్టలేరు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.
అనర్హత వేటు పడింది వీరి మీదే..
రమేష్ జార్కిహోళి (గోకక్), మహేశ్ కుమటళ్లి (అథణి), ఆర్ శంకర్ (రాణి బెన్నూరు), ఆనంద్ సింగ్ (విజయనగర), విశ్వనాథ్ (హుణసూరు), ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి), బీసీ పాటిల్ (హిరెకెరూర్), శివారం హెబ్బార్ (యల్లాపుర), ఎస్టీ సోమశేఖర (యశ్వంతపుర), టీ గోపాలయ్య (మహాలక్ష్మి లేఅవుట్), బైరతి బసవరాజ్ (కృష్ణరాజపురం), మునిరత్న (రాజరాజేశ్వరి నగర), రోషన్ బేగ్ (శివాజీ నగర), ఎంటీబీ నాగరాజు (హోస్కొటే), సుధాకర్ (చిక్బళ్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కగ్వాడ).