అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది రియాజ్ అరెస్టు
బెంగుళూరు: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన తీవ్రవాదిగా అనుమానిస్తూ రియాజ్ భత్కల్(32)ను బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్ వెళ్తుండగా మంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
రియాజ్ భత్కల్ పూర్తి పేరు రియాజ్ అహ్మద్ సయ్యిది. కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా భత్కల్ పట్టణంలోని మ్యాక్డూమ్ కాలనీకి చెందిన వాడు. ఇటీవల బెంగుళూరులోని చర్చి స్ట్రీట్లో సంభవించిన బాంబు పేలుడు ఘటనలో నిందితుల్లో ఒకడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గత వారం చర్చి స్ట్రీట్ బాంబు పేలుడు ఘటనలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సయ్యద్ ఇస్మాయిల్ ఆఫక్ (34), సద్దాం హుస్సేన్ (35)తో పాటు అబ్దుల్ సుబుర్ అనే 24ఏళ్ల ఎమ్బీఏ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు.
వీరివద్ద నుంచి నైట్రేట్, డిటోనేటర్లు, ఎలక్ట్రానిక్ టైమర్లు, పీవీసీ పైపులు, ద్రవ ఇంధనం, డిజిటల్ సర్క్యూట్స్ స్వాధీనం చేసుకున్నట్లు బెంగుళూరు సిటి కమిషనర్ ఎమ్ఎన్. రెడ్డి తెలిపారు. ఈ ముగ్గురు కలిసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న మరో వ్యక్తి సుల్తాన్ ఆర్మర్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ కర్ణాటకలో పెద్ద ఎత్తున విధ్వంసాలకు పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
బెంగుళూరులోని చర్చి స్ట్రీట్లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో వీరిని నిందితులుగా అనుమానిస్తున్నారు. బెంగుళూరులోని బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో జరిగిన ఈ బాంబు పేలుడులో తమిళనాడుకు చెందిన మహిళ భవానీ దేవి (38) చనిపోయారు. ఆమె కుటుంబ సభ్యుడు కార్తిక్ సహా, మరో ఇద్దరు గాయపడ్డ విషయం తెలిసిందే.