కార్తీ చిదంబరం కేసులో ఓ శక్తిమంతమైన నేత! ఈడీ దర్యాప్తుతో వెలుగులోకి, సుప్రీంలో కార్తీ అప్పీలు...
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తులో సంచలన విషయం వెల్లడైంది. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతుల మంజూరు కోసం ముడుపులు చెల్లించినట్లు ఇంద్రాణీ ముఖర్జియా సాక్ష్యమిచ్చిన నేపథ్యంలో ఈడీ మరిన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
Recommended Video
ఈ కేసులో ఓ శక్తిమంతమైన రాజకీయ నేత ప్రమేయం కూడా ఉందని, ఆయన బ్యాంకు ఖాతాకు కార్తీ చిదంబరం రూ.1.8 కోట్లు జమ చేసినట్లు ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ శాఖలోని తన ఖాతా నుంచి కార్తీ ఈ సొమ్మును ఆ రాజకీయ నేత ఖాతాకు బదిలీ చేసినట్లు తెలిపాయి. మరోవైపు ఈడీ దర్యాప్తుపై కార్తీ సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
ఇంద్రాణీ ముఖర్జియా ఏం చెప్పిందంటే
ఐఎన్ఎక్స్ మీడియా టెలివిజన్ కంపెనీని పీటర్, ఇంద్రాణీ ముఖర్జియా కలిసి ఏర్పాటు చేశారు. ఈ సంస్థలో విదేశీ పెట్టుబడుల కోసం అనుమతి పొందేందుకు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరంతో నార్త్ బ్లాక్లో సమావేశమైనట్లు ఇంద్రాణీ తన వాంగ్మూలంలో తెలిపారు. ఇందుకు బదులుగా తన కుమారుడు కార్తీ వ్యాపారాలకు సహాయపడాలని చిదంబరం తమను కోరారని ఇంద్రాణీ ఈడీ విచారణలో వెల్లడించారు.
ఎవరా సీనియర్ రాజకీయ నేత?
చెన్నైలోని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ శాఖలోని తన ఖాతా నుంచి కార్తీ చిదంబరం ఓ రాజకీయ నేత ఖాతాకు రూ.1.8 కోట్లు జమచేసినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కార్తీ నుంచి ఈ సొమ్మును స్వీకరించిన ఆ రాజకీయ నేత ఎవర్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సదరు రాజకీయ నేత పేరు, ఇతర వివరాలను మాత్రం ఈడీ వెల్లడించలేదు. అలా చేస్తే తమ దర్యాప్తుకు తీవ్ర ఆటకం ఏర్పడుతుందని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సదరు నేతకు దశాబ్దాల రాజకీయ జీవితం ఉందని, ఆయన కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారనే వివరాలు మాత్రమే వెల్లడయ్యాయి.
కస్టడీ గడువు పెంపునకు సీబీఐ యోచన...
మరోవైపు కార్తీ చిదంబరం కస్టడీని పొడిగించాలని సీబీఐ కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంను గత నెల 28న చెన్నై విమానాశ్రయంలో సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ కోర్టు ఆయనకు ఈ నెల 6 వరకు సీబీఐ కస్టడీకి ఆదేశించింది. ఇంద్రాణి ముఖర్జీతో పాటు బైకుల్లా జైలులో కార్తీని ప్రశ్నించిన అనంతరం, ఆయనను ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే కార్తీని మరింత లోతుగా విచారించేందుకు ఇంకాస్త గడువు అవసరమని సీబీఐ భావిస్తోంది. ఈ మేరకు సీబీఐ ఆయన కస్టడీని పొడిగించాలని న్యాయస్థానాన్ని కోరబోతోంది.
ఈడీపై సుప్రీంను ఆశ్రయించిన కార్తీ...
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం సుప్రీంకోర్టు గడప తొక్కారు. ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ.. ఆయన సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ అధికారాన్ని కార్తీ సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్లో నమోదు చేయని విషయాలపై సీబీఐ, ఈడీలు తనను ప్రశ్నిస్తున్నాయని కార్తీ చిదంబరం తన పిటిషన్లో ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనని, రాజకీయ దురుద్దేశ్యంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని కార్తీ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో సుప్రీంకోర్టు రేపు వాదనలు విననుంది.