పాకిస్తాన్ అభిమానులు చంపేశారు: బీజేపీ ఎంపీ తీవ్ర ఆగ్రహం
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చందన్ గుప్తా హత్యకు గురయ్యాడు. దీనిపై బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ మంగళవారం మాట్లాడారు.
తిరంగా బైక్ ర్యాలీ సందర్భంగా పాకిస్తాన్ అభిమానులు అతనిని చంపేశారని ఆరోపించారు. ఆయనను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పాకిస్తాన్ మద్దతుదారులు కస్గంజ్ వచ్చారని, వారు కేవలం పాకిస్తాన్ జెండాను మాత్రమే గౌరవిస్తారని, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని మండిపడ్డారు. వీరే తమ కార్యకర్తల్లో ఒకరైన చందన్ గుప్తాను హత్య చేశారన్నారు.
కలెక్టర్ వివాదాస్పద పోస్టు
కాస్ గంజ్ మత ఘర్షణలపై బరేలీ కలెక్టర్ తన ఫేస్బుక్ ఖాతాలో వివాదాస్పద పోస్టు పెట్టారు. ఈ మధ్య ఘర్షణలు చెలరేగినప్పుడు కొందరు చేసే పనులు విచిత్రంగా ఉంటున్నాయని, మాట్లాడితే ఇస్లాం ప్రజల ఇళ్ల ముందుకు వెళ్లి పాక్ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని, ఇదంతా ఎందుకని ప్రశ్నించారు.
కాగా, తిరంగా ర్యాలీలో చందన్ గప్తా పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి, హింసాత్మకంగా మారిందని అంటున్నారు. ఈ ఘటనలో చందన్ గుప్తా ప్రాణాలు కోల్పోయాడు. పలువురు గాయపడ్డారు. దీంతో కర్ఫ్యూ విధించి, భద్రతా బలగాలను రంగంలోకి దింపారు.