కశ్మీర్ విభజన బిల్లుకు లోక్సభలోనూ ఆమోదం.. అనుకూలం 367 వ్యతిరేకం 67..
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ జరిపి .. తర్వాత డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు ఉన్న బీజేపీ, భాగస్వామ్య పక్షాల మద్దతుతో దిగువసభలో ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే బిల్లు రాజ్యసభలో ఆమోదం పడటంతో .. రాష్ట్రపతి ఆమోదంతో ప్రక్రియ పరిపూర్ణం కానుంది. తర్వాత గెజిట్ విడుదల చేయడంతో జమ్ముకశ్మీర్ భారతదేశంలో ఎలాంటి స్వయం ప్రతిపత్తి లేకుండా భాగస్వామ్యం కానుంది.
లోక్ సభలో ఇలా
కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసింది. వెంటనే రాజ్యసభలో 4 బిల్లులను ప్రవేశపెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.
నిన్నపెద్దల సభలో గట్టెక్కిన బిల్లు .. ఇవాళ లోక్సభలో సునాయసంగా ఆమోదం పొందింది. బీజేపీకి 300 పైచిలుకు సభ్యులు ఉండగా .. భాగస్వామ్య పక్షాల మద్దతుతో సులువుగా ఆమోదం లభించింది. కశ్మీర్ విభజన బిల్లును లోక్ సభలో కూడా డివిజన్ పద్ధతిలో లెక్కించారు. బిల్లుకు అనుకూలంగా 367 మంది సభ్యులు మద్దతు తెలిపారు. వ్యతిరేకంగా 67 మంది సభ్యులు ఓటేశారు. దీంతో కశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపడమే మిగిలిపోయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ గెజిట్ విడుదల చేయడంతో కశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయే ప్రక్రియ పూర్తవుతుంది. కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. కశ్మీర్ అసెంబ్లీ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం కాగా .. లఢఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారుతుంది. దీంతోపాటు అప్పటివరకు ఉన్న రిజర్వేషన్ బిల్లు ఉపసంహరించుకున్నట్టు తెలిపారు అమిత్ షా. కశ్మీర్ విభజన బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడంతో దేశంలోని మిగతా రాష్ట్రాల్లో వర్తించే రిజర్వేషన్లు వారికి వర్తిస్తాయని సభకు తెలిపారు అమిత్ షా. సభలో బిల్లుల ఆమోదం తర్వాత దిగువసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
పెద్దల సభలో ఇలా
కశ్మీర్ విభజన బిల్లును మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదింపజేయాలని నిన్న రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు భావించగా .. డివిజన్ పద్ధతిలో ఓటింగుకు సభ్యులు పట్టుబట్టారు. మధ్యలో కొద్దిసేపు సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో స్లిప్పుల ద్వారా ఓట్లను లెక్కించారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో సభలో 191 మంది సభ్యులు ఉన్నారు. కశ్మీర్ విభజన బిల్లుకు 125 మంది మద్దతు తెలిపారు. ఎన్డీఏ సహా మిత్రపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. అయితే సభలో ఉన్న మరో సభ్యుడు ఎవరికీ ఓటేయక .. తటస్థంగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications