అంబానీ కంపెనీ ఫైల్పై సంతకం చేస్తే రూ 150 కోట్ల లంచం - ప్రధానికి చెప్పా : సత్యపాల్ సంచలనం...!!
జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్..ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు.ఈ విషయాన్ని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ఆయన జమ్ము కాశ్మీర్ గవర్నర్ గా పని చేసిన సమయంలో జరిగిన కీలక విషయాలను బహిరంగంగా చెప్పేసారు. తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడినట్లు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. రాజస్థాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు
ఆ ఫైల్ క్లియర్ చేస్తే లంచం ఇస్తారంటూ
తాను అక్కడ గవర్నర్ గా పని చేస్తున్న సమయంలో తన టేబుల్పై రెండు ఫైళ్లు వచ్చాయని తెలిపారు. అవి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థలవిగా చెప్పారు. అయితే, ఫైల్ వెనుక కుంభకోణం దాగి ఉందని ప్రభుత్వ కార్యదర్శులు చెప్పటంతో ఆ ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయంచానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆ ఫైల్పై సంతకం చేస్తే 'మీకు రూ.150 కోట్ల లంచం ఇస్తారు' అని ఆ కార్యదర్శులు తనతో చెప్పారని సత్యపాల్ వెల్లడించారు.
రెండు కీలక అంశాలను వెల్లడించిన గవర్నర్
కశ్మీర్కు తాను ఐదు జతల కుర్తా-పైజామాలతోనే వచ్చానని... వాటితోనే వెళ్లిపోతానని తాను వారికి చెప్పిన విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన పదవినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఆ ఫైల్పై సంతకం చేయబోనని ప్రధాని నరేంద్ర మోదీకి తెగేసి చెప్పానన్నారు. అవినీతిపై రాజీపడాల్సిన అవసరం లేదని ప్రధాని కూడా తన చర్యను సమర్థించారని మాలిక్ వెల్లడించారు. సత్యపాల్ మాలిక్ ఆగష్టు 21, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా నియమితులయ్యారు. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు.
ప్రధానికి చెబితే..సమర్ధించారు
ప్రస్తుతం ఆయన మేఘాలయకు గవర్నర్గా పని చేస్తున్నారు. అదే సమయంలో జరిగిన మరో ఇష్యూను బయటకు చెప్పారు. ఆరెస్సెస్ తో సంబంధం ఉన్న వ్యక్తికి చెందిన ఫైల్ను కూడా తన సంతకం కోసం పంపారని..ఆయన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని చెప్పారు. ఆ ఫైల్ వెనుకా కుంభకోణం ఉందని, దానిపై సంతకం చేస్తే రూ.150 కోట్ల లంచం ఇస్తారని కార్యదర్శులు తనకు చెప్పినట్లుగా వెల్లడించారు. దీంతో..తాను ఆ ఫైల్ పైనా సంతకం చేయలేదని చెప్పుకొచ్చారు.
Recommended Video
వైరల్ గా మారిన సత్యపాల్ వ్యాఖ్యలు
కశ్మీర్లోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులకు గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఆరోగ్య బీమా ఇవ్వడానికి రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 2018 అక్టోబరులో ఈ ఒప్పందాన్ని నాటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ రద్దుచేశారు. గవర్నర్ సత్యపాల్ చేసిన వ్యాఖ్యలు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్పై రూ.10 కోట్ల దావా వేశారు. ఈ మేరకు ఆయనకు ఆమె తరఫు న్యాయవాది లీగల్ నోటీసు పంపారు. తన పరువుకు భంగం కలిగేలా చేసిన వ్యాఖ్యలను మాలిక్ వెనక్కి తీసుకోవాలని లేకపోతే రూ.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో ముఫ్తీ హెచ్చరించారు.