'కచ్చతీవు'పై మళ్లీ మొదలైన రాజకీయం
రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 'కచ్చతీవు' అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల టీవీకే చీఫ్, ప్రముఖ నటుడు విజయ్.. భారత మత్స్యకారుల రక్షణ కోసం కచ్చతీవును శ్రీలంక నుంచి తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయనందుకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.
శ్రీలంక స్పందన
శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హేరత్ ఈ అంశంపై స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కచ్చతీవు శ్రీలంకలో అంతర్భాగమని, కేవలం దౌత్యపరమైన చర్చలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ వ్యూహం
కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మత్స్యకారులను కాపాడటంలో విఫలమైందని టీవీకే చీఫ్ విజయ్ ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని గతంలో వచ్చిన వార్తలను విజయ్ ఖండించారు. ఆయన అధికార పార్టీ డీఎంకేతో పాటు బీజేపీని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కూడా ఇదే చర్చ
లోక్సభ ఎన్నికల ముందు కూడా కూడా బీజేపీ కచ్చతీవు అంశాన్ని లేవనెత్తి కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించింది. ఆ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఈ సమస్య అకస్మాత్తుగా రాలేదని, దీనిపై నిరంతరం చర్చ జరుగుతోందని చెప్పారు. భారత మత్స్యకారుల హక్కుల విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు.
నెహ్రూ-ఇందిరాలపై విమర్శలు
ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కచ్చతీవు, భారత మత్స్యకారుల హక్కులను పట్టించుకోలేదని అన్నారు. ఈ సమస్య తమకు ఒక తలనొప్పిగా భావించి కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేశారని ఆరోపించారు. అప్పట్లో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఆరోపించారు.
తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ, ఏఐఏడీఎంకే మరోసారి కలిసి పొత్తు పెట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications