ప్రజా సమక్షంలో ఢిల్లీ సిఎంగా కేజ్రీవాల్ ప్రమాణం
న్యూఢిల్లీ: ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం రాం లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెసు మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది.
ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనతో పాటు ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బిజెపి నేత హర్షవర్ధన్, న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతి భూషన్ వచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పిన్న వయస్కుడిగా కేజ్రీవాల్ రికార్డు సృష్టించారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. మంత్రులుగా మనీషి సిసోడియా, గిరీష్ సోనీ, సత్యేంద్ర కుమార్, రాఖీ బిర్లా, సోమనాథ్, సౌరబ్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం చేశారు.
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దాదాపు 60 వేల మంది హాజరైనట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద యెత్తున సందడి నెలకొంది.
ప్రమాణ స్వీకారం తర్వాత కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతటి విప్లవం వస్తుందని తాము ఊహించలేదని ఆయన అన్నారు. ఇది ప్రజల విజయమని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని, పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. దేశంలో ఇది చారిత్రకమైన రోజు అని ఆయన అన్నారు. తమ వద్ద మంత్రదండం లేదని, ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే రేపే సమస్యలు పరిష్కారం కాబోవని, అయితే సమస్యలను పరిష్కరిస్తామని ఆయన చెప్పారు
ఢిల్లీ ప్రజలకు నీతవంతమైన పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రజలు కలిసి పనిచేస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. ఇది సామాన్యుడి విజయమని ఆయన అన్నారు. రాజకీయాల్లో డబ్బులతోనే కాకుండా నిజాయితీగా కూడా ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని నిరూపించామని ఆయన అన్నారు.
ఈ రోజు కేజ్రీవాల్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయలేదని, ఢిల్లీకి చెందిన ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది రెండు కోట్ల మంది ఢిల్లీ ప్రజల ప్రభుత్వమని ఆయన అన్నారు. రాజకీయాలు బురద అని అన్నా హజారే అంటుండేవారని, ఆ బురదను ఊడ్చివేయడానికి చీపురు రాజ్యం వచ్చిందని ఆయన అన్నారు.
అవినీతి అంతానికి ఫోన్ నెంబర్
తనకు అన్నా హజారే ఆశీస్సులున్నాయని ఆయన చెప్పారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ చేసి చెప్పాలని, అందుకు తాము ఫోన్ నెంబర్ ఇస్తామని, రెండు రోజుల్లో ఆ ఫోన్ నెంబర్ ఇస్తామని ఆయన చెప్పారు. లంచం ఇవ్వను, తీసుకోను అని ఆయన ప్రజలతో శపథం చేయించారు. పదవుల కోసం కాదు, సమస్యల పరిష్కారానికే పోరాడమని ఆయన చెప్పారు. తాము తిరిగి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, తిరిగి పెద్ద యెత్తున విజయం సాధించి అధికారానికి వస్తామని ఆయన చెప్పారు.