పార్క్ చేసి ఉన్న లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థులు మృతి
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తమిళనాడులోని దుండిగల్ కు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో ఎన్ హెచ్-66 పైన పనంబిక్కున్ను కైపమంగళం ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు గురువాయూర్ నుంచి కొడంగల్లూర్ కు వెళ్తున్న క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఓ లారీ రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో అది లారీ కిందకు చొచ్చుకుపోయింది. దాంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద ధాటికి కారులోని 8 మందిలో ఏడుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతులంతా తమిళనాడులోని దిండిగల్లో ఉన్న PSNA ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై లారీని అక్రమంగా పార్క్ చేయడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.

మృతులు సూర్య, యువ సంజిత్, జోషువా, మురళి, జీవా, సంతోష్, ప్రసన్న, విశ్వలుగా గుర్తించారు. సీసీటీవీ ఫూటేజ్ లో కారు జెట్ స్పీడులో డివైడర్ అంచునుంచి వెళ్తున్నట్లు కనిపించిందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే పార్కింగ్ చేసిన లారీ.. సీసీటీవీలో కనిపించలేదని తెలిపారు. కారు నుజ్జునుజ్జు కావడంతో లారీ కిందకు ఇరుక్కుపోయిన కారును అతి కష్టం మీద బయటకు తీయాల్సి వచ్చిందని అన్నారు. ఇక ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో అక్కడి ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఘటన జరిగిన తర్వాత స్థానికులు, ఫైర్ సిబ్బంది, పోలీసుల సాయంతో సహాయక ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications