కేరళ సీఎంకు షాక్ : ఆ నిర్ణయం సరికాదన్న ఐఎంఏ.. ఉపసంహరించుకుంటారా?
లాక్ డౌన్ కారణంగా కల్లు,మద్యం దుకాణాలు ఒక్కసారిగా మూతపడటంతో మద్యం ప్రియులు,తాగుబోతులు అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. అలవాటైన ప్రాణాలు.. పూటకు చుక్క వేస్తే గానీ స్థిమితంగా ఉండలేనివారు.. మద్యం లేక జుట్టు పీక్కుంటున్నారు. అంతేనా.. రోడ్ల మీద పడి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా వైన్ షాపులకే కన్నం వేసే పనులు కూడా చేస్తున్నారు. మరికొందరైతే సైకోలుగా ప్రవర్తిస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) తీవ్రంగా తప్పు పట్టింది.

విజయన్ ఏం చెప్పారు
మద్యం దొరకని కారణంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం కలిగించేలా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్తో వచ్చేవారికి మద్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తాజా ప్రెస్ మీట్లో ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా మద్యం విక్రయాలు ఆపేయడంతో.. కొంతమంది మానసిక,శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు రోడ్ల పైకి వస్తే లేని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి సమస్య తీవ్రంగా ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్ తీసుకెళ్లి మద్యం తెచ్చుకునేలా
చర్యలు తీసుకున్నారు.

మద్యం దొరక్క ఆత్మహత్యలు
అంతేకాదు,అలాంటి సమస్యలతో వచ్చేవారిని డీఎడిక్షన్ సెంటర్లో చేర్పించి ఉచిత చికిత్స అందించాలన్నారు. మద్యం దొరకని కారణంగా రాష్ట్రంలో కొంతమంది ఆత్మహత్యలకు యత్నిస్తుండటంతో
ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. శనివారం(మార్చి 26)న త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడగా.. కాయంకులంలో ఓ యువకుడు(38) మద్యం దొరకని కారణంగా షేవింగ్ లోషన్ని సేవించాడు.

సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టిన ఐఎంఏ
పినరయి విజయన్ నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) తప్పు పట్టడం గమనార్హం. మందుకు బానిసలైనవారికి సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్పితే ఆల్కాహాల్ పంపిణీ చేయాలనుకోవడం సరికాదని పేర్కొంది. శాస్త్రీయంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించలేమని తెలిపింది. ఆసుపత్రులు లేదా అవసరమైతే ఇళ్లల్లోనే వారికి తగిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రిస్కిప్షన్లో లిక్కర్ గురించి రాయడం చికిత్స చేయించుకునే హక్కును నిరాకరించినట్టవుతుందని ప్రభుత్వానికి గుర్తుచేసింది. దీనిపై విజయన్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రిస్క్రిప్షన్ చర్యలను ఉపసంహరించుకుంటారా లేక కొనసాగిస్తారన్నది వేచి చూడాలి.
Recommended Video

తెలంగాణలోనూ అదే పరిస్థితి..
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కల్లు బట్టీలు ఎక్కువగా ఉండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లుకు బానిసైనవారు.. ఇప్పుడది దొరక్క పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తమకోసం రోజుకు కనీసం రెండు గంటలైనా కల్లు దుకాణాలు తెరవాలని కోరుతున్నారు. ఇటు మద్యం ప్రియులు కూడా మద్యం దొరక్క ఆత్మహత్యలకు యత్నిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఇప్పుడైతే వాటిని తెరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే పరిస్థితిని బట్టి దాని గురించి ఆలోచిస్తామన్నారు.












Click it and Unblock the Notifications