గ్రేటర్ హైదరాబాద్ లో జల సంక్షోభం,3శాతమే నీరు.. షాకింగ్ కేంద్ర నివేదిక!
మహానగరం హైదరాబాద్ను రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ముంచెత్తనుందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి తాజా నివేదికలు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూగర్భ జలాల నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. గత ఏడాది 2025నాటి గణాంకాలను పరిశీలిస్తే, నగరంలో లభ్యమవుతున్న భూగర్భ జల వనరులలో ఏకంగా 99 శాతానికి పైగా నీటిని తోడేసినట్లు భూగర్భ జల వనరుల శాఖ జరిపిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి.
నగరవాసుల తాగునీటి అవసరాలకు పెద్ద కష్టం
ఈ పరిణామం రాబోయే కాలంలో నగరవాసుల తాగునీటి అవసరాలకు పెద్ద సవాలుగా మారనుంది. ఇప్పటికే నగర వాసులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నగరీకరణ వేగంగా పెరగడం, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు, కాంక్రీట్ జంగిల్గా మారిన నగర వీధుల కారణంగా వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గాలు మూసుకుపోయాయి.

బోరు బావుల వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి
దీనికి తోడు జనాభా అవసరాలకు అనుగుణంగా వేల సంఖ్యలో యథేచ్ఛగా తవ్వుతున్న బోరు బావుల వల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. సాధారణంగా వర్షాకాలంలో భూమిలోకి చేరే నీటి శాతం కంటే, మోటార్ల ద్వారా బయటకు తీస్తున్న నీటి శాతమే అత్యధికంగా ఉంది. దీనివల్ల భూగర్భ జలాల రీఛార్జ్ ప్రక్రియ పూర్తిగా దెబ్బతిని, లభ్యత దాదాపు శూన్య స్థాయికి చేరుకుంది
ఈ ఏరియాల్లో వందల అడుగుల లోతుకు వెళ్లినా కనిపించని నీటి జాడ
ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రాంతాలతో పాటు కూకట్పల్లి, సికింద్రాబాద్ పరిసరాల్లోని పలు నివాస ప్రాంతాల్లో వందల అడుగుల లోతుకు వెళ్లినా చుక్క నీరు పడని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా నగరవాసులు, ప్రభుత్వం అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్రమైన 'డే జీరో' ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటి కోసం కఠిన నిబంధనలు తీసుకు రావాల్సిందే
ప్రతి భవనంలో వర్షపు నీటి నిల్వ గుంతలను తప్పనిసరిగా నిర్మించుకోవాలని, భూగర్భ జలాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా భూగర్భ జలాలు పెరిగే చర్యలతో పాటు, జలాల దుర్వినియోగాన్ని నివారించే చర్యలు తీసుకోకపోతే భాగ్యనగర వాసుల భవిష్యత్ కు నీటి గండం తప్పదు.













Click it and Unblock the Notifications