ఇక మమత వైపు నిలిచేది ఎంతమంది? టీఎంసీలో అసలేం జరుగుతోంది?
తృణమూల్ కాంగ్రెస్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న అంతర్గత సంక్షోభం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల తిరుగుబాటు మరువకముందే.. ఇప్పడు పార్లమెంట్ వేదికగా దీదీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ బుధవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. సుస్మితా దేవ్ ఈ నెలలోనే రాజ్యసభకు రాజీనామా చేసిన రెండో కీలక నేత కావడం గమనార్హం. ఏ వైపు రాజ్యసభ ఎంపీలు వీడుతుండగా.. మరోవైపు లోక్సభలో ఏకంగా 20 మంది టీఎంసీ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇటీవలే బెంగాల్ అసెంబ్లీలో 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలలో దాదాపు 58 మంది తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అధిష్టానం నిర్ణయాన్ని కాదని బహిష్కృత ఎమ్మెల్యే రీతబ్రత బెనర్జీని విపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు అదే తరహా తిరుగుబాటు లోక్సభలోనూ రిపీట్ అవుతోంది. టీఎంసీకి చెందిన సీనియర్ లోక్సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో దాదాపు 20 మంది ఎంపీలు తాము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. బెంగాల్ అభివృద్ధి కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.

మరో రెబల్ ఎంపీ షర్మిలా సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అసమ్మతి ఎంపీలంతా కలిసి కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో ఓ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ నివాసంలో జరిగిన కీలక సమావేశం తర్వాత వీరంతా ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. లోక్సభలో టీఎంసీకి ప్రస్తుతం ఉన్న 28 మంది ఎంపీలలో 20 మంది తిరుగుబాటు చేయడంతో పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండటానికి అవసరమైన మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ ఈ రెబల్ గ్రూప్నకు ఉండటంతో మమతా బెనర్జీకి ఇది కోలుకోలేని దెబ్బగా మారనుంది.
లోక్సభలో ఈ చీలిక భయాలు నడుస్తుండగానే.. రాజ్యసభలో మాత్రం ఇప్పటికే వికెట్లు పడిపోయాయి. జూన్ 8న పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీలో అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తన రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే సుస్మితా దేవ్ కూడా రాజ్యసభ ఛైర్మన్ సి.పి. రాధాకృష్ణన్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా చేసిన వెంటనే ఆమె అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతో భేటీ కావడం, ఆమె త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఇద్దరి నిష్క్రమణతో రాజ్యసభలో టీఎంసీ బలం 11 స్థానాలకు పడిపోయింది.
ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ తీవ్రంగా స్పందించారు. పార్టీని వీడుతున్న వారంతా అవకాశవాదులని, మునిగిపోతున్న నావ నుంచి దూకుతున్నారని ఆయన విమర్శించారు. వీరందరికీ అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై ఫిర్యాదులు ఉన్నాయనే విషయం మాత్రం నిజమేనని ఆయన అంగీకరించారు. ఏది ఏమైనప్పటికీ ఓ వైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు, మరోవైపు ఎంపీల వరుస రాజీనామాలు, ఎన్డీఏ వైపు జంపింగ్లతో మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications