ప్రధాని మోదీకి కేంద్ర కేబినెట్ స్టాండింగ్ ఒవేషన్.. !!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. 4,399 రోజుల నిరంతర పదవీకాలం, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధాన మంత్రిగా ఆయన నిలిచారు. 2014 మే 26న మొదటిసారి అధికారం చేపట్టిన మోదీ.. 2019లో భారీ మెజారిటీతో తిరిగి ఎన్నికయ్యారు. అనంతరం, 2024 జూన్ 9న వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ నేపథ్యంలో ఈ ఉదయం దేశ రాజధానిలో కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. మోదీని అభినందిస్తూ ఓ ఏకవాక్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రులందరూ కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నిల్చుని చప్పట్లు కొడుతూ ఆయనను అభినందించారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఓ భారీ సమావేశాన్ని నిర్వహించబోతోంది. దీంతో పాటు కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా దీన్ని జరుపుకోనుంది.

దేశ రాజధానిలోని భారత్ మండప్ లో ఈ ప్రత్యేక సమావేశం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని అన్ని పక్షాల నాయకులు, బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మోదీ సాధించిన రికార్డుపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశం ఉంది. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, వేగవంతమైన ఆర్థికాభివృద్ధి, మెరుగైన సంక్షేమ పథకాలు, నూతన జాతీయ రహదారుల నిర్మాణం, వందే భారత్ వంటి రైళ్లను ప్రవేశపెట్టడం వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
అలాగే 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఇందులో చర్చించవచ్చని తెలుస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా, కీలక అంతర్జాతీయ అంశాలపై ఈ మారథాన్ మీటింగ్ అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. అనంతరం ఈ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఎన్డీఏ కూటమిలోని 35 ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 75 మంది అగ్రనేతలు, పార్టీ అధ్యక్షులు ఈ సదస్సులో పాల్గొంటారని అంచనా. బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా వంటి కీలక కేంద్ర మంత్రులు, నాయకులు కూడా పాల్గొననున్నారు.
గతంలో జవహర్లాల్ నెహ్రూ 1952 మే 13న బాధ్యతలు చేపట్టి, 1964 మే 27 వరకు మొత్తంగా 4,398 రోజుల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. అంతకుముందు 1947 నుంచి 1952 మధ్య ఆయన మధ్యంతర ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. అప్పట్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేదు. ఇందిరా గాంధీ కూడా సుమారు 14 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నప్పటికీ.. ఆమె పదవీ కాలంలో అంతరాయం ఏర్పడింది.












Click it and Unblock the Notifications