మత్స్యకారులారా! మీకు వందనాలు: కేరళ వరదలు, రెండు అద్భుత ఫోటోలు!
తిరువనంతపురం: కేరళ వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వందలాది మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారికి ఎన్డీఆర్ఎప్, ఆర్మీతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ సేవలు అందిస్తోంది. మత్స్యకారుల సహకారం అందరినీ ఆకట్టుకుంటోంది.
Recommended Video
ఇందుకు సంబంధించి శ్వేతశ్రీ అనే నెటిజన్ తన ట్విట్టర్ అకౌంట్లో మత్స్యకారులకు ఓ గ్రామస్తులు నమస్కరిస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం కేరళ నుంచి నేను రెండు అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ సంపాదించానని పేర్కొంటూ.. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు.
అందులో ఓ డీసీఎంలో ఉన్న ఇద్దరు మత్స్యకారులకు గ్రామస్తులు రోడ్డుపై నిలబడి నమస్కరిస్తున్నారు. అందులో ఒకరు మత్స్యకారులకు మరింత గౌరవం ఇస్తూ చెప్పులు కూడా విప్పేసి నమస్కరించారు. తమను ఆదుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.
ఇదిలా ఉండగా, కేరళ వరద బాధితులను ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థ సేవాభారతి కూడా ఆదుకుంటోంది. సేవాభారతి కొట్టాయం జిల్లాలో 27 కేంద్రాలు, ఎర్నాకులం జిల్లాలో 18 క్యాంపులు, ఇడుక్కిలో 11 క్యాంపులు ఏర్పాటు చేసింది. వాయనాడ్ జిల్లాలో కూడా వరదతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తున్నారు. కన్నూర్, తలసేరిలలో లాజిస్టిక్స్ గోడౌన్ ఏర్పాటు చేసి సహకరిస్తున్నారు.
దీనిపై కేరళ రాష్ట్ర సేవాభారతి ఇంచార్జ్ కుమార్ మాట్లాడుతూ.. ఆరెస్సెస్, సేవాభారతి చేస్తున్న సహాయాన్ని మీడియా చూపించడం లేదన్నారు. తమ పట్ల నెగిటివ్ న్యూస్ ప్రచారం చేస్తోందని వాపోయారు. మేం మా పనిని పబ్లిసిటీ కోసం వినియోగించుకోదల్చుకోలేదన్నారు. మా పనిని ఇక్కడి ప్రజలు గుర్తిస్తే చాలన్నారు. మేం ఏం చేస్తున్నామో... ప్రజలే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నారన్నారు. తాము తమ మైలేజీ కోసం ఈ పని చేయడం లేదని, ఆపదలోని వారిని కాపాడటం కోసం చేస్తున్నామన్నారు.