కేరళకు యూఏఈ రూ.700 కోట్ల సాయం: 10ని.ల్లో జెండా ఎగురవేస్తారనగా.. యువతి కంటతడి
Recommended Video
తిరువనంతపురం: వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళకు యూఏఈ (యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్) నుంచి 100 మిలియన్ల డాలర్ల సహాయం రానుందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మంగళవారం తెలిపారు. ఇండియన్ ఆర్మీ దాదాపు 11వేల మందిని రక్షించారు. అలాగే 49 ప్రాంతాల్లో కనెక్టివిటినీ తిరిగి పెంపొందించారు. పన్నెండు లక్షల మందికి పైగా రిలీఫ్ క్యాంపుకు తరలించారు.
కేరళ వరదలు: వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు, ప్రశంసల జల్లు
కేరళలో జలవిలయం ఎలాంటి పెను విపత్తును సృష్టించిందో తెలుస్తోంది. ఒక్కొక్కరి కన్నీటి గాథలు కూడా వెలుగు చూస్తున్నాయి. రెండు రోజులుగా వర్షాలు, వరదలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కొక్కరి కన్నీటి గాథ హృదయం ద్రవించేలా ఉంది.
స్కూల్లో జెండా ఎగురవేస్తారనగా
చెంగన్నూరు సమీపంలోని ఓ గ్రామంలో ఓ యువతి చెప్పిన వివరాల ప్రకారం... ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో పది నిమిషాల్లో స్కూల్లో జెండా ఎగురవేస్తారనగా వరద వచ్చింది. ఈ వరద క్షణక్షణానికి పెరిగింది. దీంతో ఏం చేయాలో వారికి దిక్కుతోచలేదు. దీంతో గ్రామస్తులంతా పాఠశాలలోకి వెళ్లిపోయారు.
అన్ని నీటిలో చిక్కుకుపోయాయి
రోడ్లపై దాదాపు ఏడు అడుగుల మేర నీరు ప్రవహించింది. ఇళ్లు అన్నీ నీట మునిగిపోయాయి. ఏమీ మిగలలేదు. విలువైన వస్తువులు వరదలో కొట్టుకుపోయాయి. బైకులు మొదలు భారీ వాహనాలు సైతం నీటి ముంపులో చిక్కుకుపోయియి.. కొట్టుకుపోయాయి.
రెండ్రోజుల తర్వాత తగ్గుముఖం
గ్రామస్థులు చేరుకున్న పాఠశాలలోకి నీరు వచ్చింది. అందరూ పాఠశాల భవనం పైకి ఎక్కి సహాయక బృందాలు వచ్చేంత వరకు వేచి చూశాయి. 17వ తేదీ వరకూ వరద నీరు ప్రవహించింది. ఆ తర్వాత రోజు నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఆ గ్రామస్తులు తమ తమ ఇళ్లలోకి చేరుకొని, అన్నింటిని సర్దుకుంటున్నారు. జరిగిన ఘటన తలుచుకొని కంటతడి పెడుతున్నారు.
యువతి కంటతడి
తన ల్యాప్టాప్, ఇంటిలోని టీవీ, ఫ్రిజ్ తదితర విలువైన వస్తువులు చెడిపోయాయని, పుస్తకాలు కొట్టుకుపోయాయని యువతి కంటతడి పెట్టుకుంది. 14వ తేదీన భారీ వర్షం పడటంతో ఆ రోజు నుంచే కరెంట్ లేదని, ఇంతవరకూ రాలేదన్నారు. కనీసం తినేందుకు తిండి తాగేందుకు నీరు లేక మూడు రోజులు అవస్థపడ్డామన్నారు.