బడ్జెట్ డాక్యుమెంట్లపై గాంధీ హత్యగావించబడ్డ ఫోటో..ఎందుకిలా..?
తిరువనంతపురం: కేరళలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా బడ్జెట్ ప్రసంగం చేశారు కేరళ ఆర్థికశాఖ మంత్రి థామస్ ఇస్సాక్. అంతేకాదు తాను అసెంబ్లీకి తీసుకొచ్చిన బడ్జెట్ ఫైలు కవర్పై గాంధీ హత్యకు సంబంధించిన పెయింటింగ్ ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.
వట్టకుజీ అనే ఆర్టిస్టు డెత్ ఆఫ్ గాంధీ నుంచి ఈ పెయింటింగ్ తీసుకున్నామని మంత్రి థామస్ ఇస్సాక్ చెప్పారు. కేంద్రానికి బలమైన సంకేతాలు పంపేందుకే బడ్జెట్ డాక్యుమెంట్స్ కవర్ ఫోటోగా ఈ చిత్రాన్ని ఉంచినట్లు మంత్రి వివరించారు. మహాత్మా గాంధీని హత్య చేసింది ఒక హిందూవాదని చెప్పిన థామస్ ఇస్సాక్... అతన్నే బీజేపీ నేతృత్వంలోని కేంద్రం గౌరవిస్తోందని దుయ్యబట్టారు. గాంధీని హత్య చేసిన ఘటన దేశ ప్రజలు మరిచిపోరని థామస్ ఇస్సాక్ అన్నారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి థామస్ ఇస్సాక్... కేంద్ర ప్రభుత్వం దేశంలో భయాందోళనలను సృష్టిస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఆర్సీ తీసుకురావడమే ప్రధాన సంస్కరణగా ఉందని మండిపడ్డారు థామస్. ఎన్ఆర్సీ ప్రజలను మతప్రాతిపదికన విభజిస్తుందని ఫైర్ అయ్యారు. అది అమలైతే కేరళలో మతపరమైన విభజనలు జరుగుతాయని ముందే ఊహించి, మత పరమైన సవాళ్లకు ధీటుగా ఈ బడ్జెట్ను తయారు చేశామని ఇస్సాక్ చెప్పారు. ఇక కేంద్రం కేరళ రాష్ట్రంను చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు. రాష్ట్రానికి రూ.24,915 కోట్లు రావాల్సి ఉండగా అందులో రూ.5325 కోట్లు తగ్గించారని కేంద్రంపై మండిపడ్డారు.
ఇదిలా ఉంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ పై జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన చిత్రాన్ని ఉంచడం సరికాదని కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీలపై పోరాడుతోందని చెప్పిన రమేష్ చెన్నితాల గాంధీ బొమ్మను పెట్టకుండా ఉంటే బాగుండేదన్నారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను పలువురు బీజేపీ నేతలు వెనుకేసుక రావడంపై చిత్రకారుడు వట్టకుజీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పెయింటింగ్ను గీశారు.