స్థానిక సంస్థల్లో ఎర్రజెండా రెపరెపలు: ఒక్క ఓటుతో ఓడిన మేయర్ అభ్యర్థి: బీజేపీ విజయం
తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఆధిపత్యాన్ని సాధించింది. ప్రారంభ ఫలితాలు ఎల్డీఎఫ్కు అనుకూలంగా వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న కేరళలో.. ఎల్డీఎఫ్ పట్టు తగ్గలేదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీల్లో వామపక్ష కూటమికి భారీ ఆధిక్యత లభిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ఓట్ల లెక్కింపుల్లో
కేరళలో గ్రామ పంచాయితీలు, బ్లాక్ పంచాయితీలు, జిల్లా పంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించారు. మొత్తం గ్రామ పంచాయతీలు-941, బ్లాక్ పంచాయతీలు-152, జిల్లా పంచాయతీలు-14, మునిసిపాలిటీలు-86, మున్సిపల్ కార్పొరేషన్లు-6 ఎన్నికలకు పోలింగ్ నిర్వహించారు. వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తెరచుకోవట్లేదంటూ ఫిర్యాదులు అందుతున్నాయి.
ప్రారంభ ఫలితాల్లో కమ్యూనిస్టుల దూకుడు..
ప్రారంభ ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వెలువడుతున్నాయి. ప్రత్యేకించి- గ్రామాల్లో తన పట్టును నిలుపుకొనేలా కనిపిస్తోంది. చాలా చోట్ల ఎల్డీఎఫ్ అభ్యర్థులు మెజారిటీలో దూసుకెళ్తున్నారు. గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలకు సంబంధించిన ప్రారంభ ఫలితాల్లో ఎల్డీఎఫ్ మెజారిటీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంటోంది. 941 గ్రామ పంచాయతీలకు ఎల్డీఎఫ్-403, యూడీఎఫ్-341, ఎన్డీఏ-29, ఇతరులు-56 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. 152 బ్లాక్ పంచాయతీల్లో ఎల్డీఎఫ్-93, ఎల్డీఎఫ్-56, ఎన్డీఏ రెండు చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించాయి.
పట్టణాల్లో పోటాపోటీ..
మొత్తం 86 మున్సిపాలిటీల్లో ఎల్డీఎఫ్-38, యూడీఎఫ్-39, ఎన్డీఏ-3, ఇతరులు-6 ఆరుచోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఆరు మున్సిపల్ కార్పొరేషన్లల్లో ఎల్డీఎఫ్-8, యూడీఎఫ్-2 డివిజన్లలో పైచేయి సాధించారు. సాయంత్రానికి చాలామటుకు వార్డులు, డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. దీనికి సెమీ ఫైనల్గా భావించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ పైచేయి సాధించేలా కనిపిస్తోంది. అదే సమయంలో వామపక్షాల పట్టు గ్రామాలకే పరిమితం అయ్యేలా ఉండటం ఆందోళనకు దారి తీస్తోంది. పట్టణాల్లో మాత్రం కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోంది.
ఒక్క ఓటు తేడాతో ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి..
ప్రతిష్ఠాత్మక కోచి మేయర్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన యూడీఎఫ్ సీనియర్ నేత ఎన్ వేణుగోపాల్.. ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడం హైలైట్గా మారింది. కోచి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్త్ ఐలండ్ వార్డ్ నుంచి పోటీ చేసిన ఆయన ఒకే ఒక్క ఓటు తేడాతో తన ప్రత్యర్థి, ఎన్డీఏ అభ్యర్థి చేతలో ఓటమి పాలయ్యారు. పదేళ్లుగా కోచి మున్సిపల్ కార్పొరేషన్పై యూడీఎఫ్ జెండా ఎగురుతూ వస్తోంది. వేణుగోపాల్ ఇప్పటిదాకా ఓడిపోలేదు. తాజాగా ఒక్క ఓటు తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు. దీనికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో చోటు చేసుకున్న లోపం, మానిప్యులేషన్ వల్లే బీజేపీ అభ్యర్థి గెలుపొందారని వేణుగోపాల్ ఆరోపిస్తున్నారు.