భర్త వదిలేశాడు: కన్నేసి కూతురిని కాటేశారు
తిరువనంతపురం: ఒంటరి మహిళల పట్ల పురుష సమాజం ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందనే విషయానికి కేరళ నిర్భయ సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. భర్త విడిచిపెడితే తాను ఉద్యోగం చేస్తూ ఇద్దరు కూతుళ్లకు ఉన్నత విద్యను చెప్పిస్తున్న మహిళ ఇంటిపై మృగాళ్లు కన్నేశారు.
మృగాళ్ల క్రూరత్వానికి బలైన పెద్ద కూతురు న్యాయవిద్య చదువుతానంటే తల్లి అంగీకరించింది. ఎర్నాకుళం నగరంలోని న్యాయకళాశాలలో చేర్పించింది. ఆమె కలలు సాకారమయ్యే లోగా మగపురుగులు పెద్దమ్మాయిని కాటేయడంతో తల్లి రాజేశ్వరి గుండె కోత చెప్పనలవి కాకుండా ఉంది.
ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్కు చెందిన పేద దళితురాలు రాజేశ్వరిని 2004లోనే భర్త వదిలేసి వెళ్లాడు. ఆమె తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తూ వస్తోంది. ఆమె భర్త వెళ్లిపోయినప్పటి నుంచి ఆ ముగ్గురు మహిళలు ఉన్న ఇంటిపై కీచకలు కన్నేశారు. వెకిలిచేష్టలు చేయడం, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, రాత్రుళ్లు ఇంటిపై రాళ్లు రువ్వడం, ఇంటిపైకి లైట్ వేయడం, బస్సులో వెళ్తుంటే వెకిలిగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడుతూ వచ్చారు.
తన పెద్ద కూతురును వేధించారంటూ 2004లో కొందరిపై తల్లి రాజేశ్వరి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసింది. అయితే పోలీసులు అంతగా పట్టించుకోలేదు. దాంతో వారు మరింత రెచ్చిపోయారు. మధ్యమధ్యలో తాత్కాలిక చర్యలతో ఊరట పొందినా చివరకు పెద్ద కూతురిని కోల్పోయే పరిస్థితి ఆ తల్లికి వచ్చింది.
రాజేశ్వరి కుటుంబం నివసించే వాట్టొలిప్పడి ప్రాంతం పొరంబోకు స్థలం. దాంతో ఇంటిస్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం వారికి ఐదు సెంట్లు కేటాయించింది. ఆ స్థలంలో ఇంటినిర్మాణం తలపెట్టారు. అయితే డబ్బులేకపోవడంతో ఇంటి నిర్మాణం ఆగిపోయింది. త్వరలోనే కొత్త ఇంటికి మారాలని అనుకున్నారు. ఇంతలోనే పెద్దకూతురిపై నాగుపాములు విషం కక్కాయి.
'కేరళ నిర్భయ': దళిత లా విద్యార్ధినిపై రేప్, అసలేం జరిగింది?
ఏప్రిల్ 28వ తేదీన రాజేశ్వరి పెద్ద కూతురు మృగాళ్ల కాటుకు బలైంది. రాజేశ్వరి ఇంటికి రావడానికి ముందు ఇంట్లోంచి ఒక పసుపు టీషర్ట్ ధరించిన యువకుడు వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని దుండగులు హత్య చేసినట్లు పరీక్షల్లో తేలింది.