కేరళలో వర్ష బీభత్సం: 8 మంది మృతి, పలువురు గల్లంతు
కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే స్థాయిలో వర్ష ప్రభావం ఉంది. వరదలతో పదుల సంఖ్యలో జనం చనిపోగా.. ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీచేశారు. కేరళలో కార్లు, వాహనాలు మునిగి ఉన్న వీడియోలు చూస్తుంటే పరిస్థితి అర్థం అవుతోంది. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఆరు జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీచేశారు.
వరదల్లో ఓ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు ఉన్న బస్సు.. వర్షపునీటితో ఉండిపోయింది. కేరళ సర్కార్ వినతితో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగాయి. కంజీరప్పల్లిన్, కొట్టాయం, పంపొడ్లో మిలిటరీ దిగింది. కొట్టాయంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు ఆగి ఉంది. వరదతో ఆ ప్రాంతంలో 12 మంది గల్లంతు అయ్యారు.
వర్ష బీభత్సం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. పర్వతాలు, నదీ సమీపంలోకి వెళ్లొద్దని సూచించింది. మంగళవారం వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. గాలి కూడా 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నందున.. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు కోరారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కోరారు. స్టే సేఫ్ అంటూ ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
వర్షాలతో 8 మంది వరకు చనిపోయారని అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఐదుగురు ఆచూకీ తెలియలేదని చెబుతున్నారు. కొట్టాయం జిల్లాలో గల పంగొడ్ క్యాంపునకు ఆర్మీ చేరుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన 12 మంది కొండ చరియల కింద చిక్కుకున్నారు. ఆరుగురు చనిపోగా.. మరో నలుగురు మాత్రం కనిపించకుండా పోయారు. ఇడుక్కి జిల్లా తొడుపుజా వద్ద ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఇద్దరు ఉన్నారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టడంతో.. ఆ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.