లక్కంటే ఇదీ.. పేద మహిళకు లాటరీలో కోటి..
తిరువనంతపురం : విధి రాతను ఎవరు మార్చగలరనుకునే నైరాశ్యం సైతం కొన్ని అనుకోని పరిణామాలకు పక్కకు తప్పుకోవాల్సిందే. జీవితమంతా కష్టాలతో బతుకీడుస్తున్న ఓ కేరళ మహిళ విషయంలో ఇదే జరిగింది. లాటరీ లక్కు ఆమె జీవితంలో కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు.. అంతులేని ఆనందంలో ఆమెను ముంచేసింది.
వివరాల్లోకి వెళితే.. రబ్బరు తోటల్లో పనిచేసే తిరువనంతపురం జిల్లాలోని కిలిమనూరుకు చెందిన నబీసాకు కోటి రూపాయల లాటరీ తగిలింది. పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గాను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి లాటరీని నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ 11వ స్త్రీ శక్తి లాటరీ నబీసాను వరించింది.
జబ్బు కారణంగా మంచం పట్టిన తల్లి, ప్రమాదంలో కాలు కోల్పోయిన చెల్లి నబీసా పైనే ఆధారపడడంతో దినదిన గండంగా బతుకీడుస్తుంది నబీసా. ఇలాంటి తరుణంలో ఆమెకు లాటరీ తగలడం జీవితానికి కొత్త ఊపిరి ఊదినట్టయింది. గతంలోనూ చాలాసార్లు లాటరీ టికెట్లను కొనుగోలు చేసిన నబీసాకు మూడుసార్లు రూ.5వేల బహుమతి, కొన్నిసార్లు వెయ్యి రూపాయల బహుమతి లభించినట్టు సమాచారం.
కాగా, లాటరీలో వచ్చిన డబ్బుతో ముందుగా ఓ ఇల్లు కట్టుకుంటానని చెబుతోంది నబీసా. అలాగే దివ్యాంగురాలైన తన సోదరి తన కాళ్లపై తాను నిలబడేందుకు గాను ఓ స్టేషనరీ దుకాణం పెట్టిస్తానంటొంది.