Sabarimala: 17-21 మధ్య అయ్యప్ప ఆలయంలో పూజలు -Keralaలో కొత్తగా 14,087 కేసులు
కేరళలోని ప్రఖ్యాత శబరిమలలో కొలువైన ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. మాస పూజల కోసం ఈ నెల 17న ఆలయాన్ని తెరువనున్నారు. ఈ నెల 21 వరకు, అంటే, ఐదు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తెలిపింది.
కేరళలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ ద్వారా గరిష్ఠంగా 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తామని బోర్డు పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటలు ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్, కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను భక్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే,
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత రెండు వారాలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆరోగ్య శాఖ శనివారం నాటి బులిటెన్ ప్రకారం, గత 24 గంటల్లో కొత్తగా 14,087 కరోనా కేసులు, 109 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,53,116కు, మొత్తం మరణాల సంఖ్య 14,489కు పెరిగింది. కాగా,
గత 24 గంటల్లో 11,867 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 29,22,921కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,15,226 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కరోనాకు తోడు జికా వైరస్ కేసులు కూడా కేరళలో కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం నాటికి 14 మందికి జికా వైరస్ సోకింది.