కేరళ ప్రమాదంపై అనుమానాలు, గుడి వద్ద 3 కార్లలో పేలుడు పదార్థాలు
తిరువనంతపురం: కేరళలోని పుట్టంగళ్ ఆలయం సమీపంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 109కి పెరిగింది. అయితే, ఈ ప్రమాదంపై కొత్త అనుమానాలు వస్తున్నాయి. సోమవారం నాడు ఉదయం పేలుడు పదార్థాలతో నిండిన మూడు కార్లను పోలీసులు ఆలయం సమీపంలో గుర్తించారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ మూడు కార్లు అక్కడే ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు. వాటి నిండా బాంబులు తదితర పేలుడు పదార్థాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాంబ్ స్క్వాడ్ బృందానికి సమాచారం ఇచ్చారు. వాటిని నిర్వీర్యం చేస్తున్నారు.
మూడు కార్లలో పైర్ క్రాకర్స్ దొరకడంపై ప్రమాదం విషయమై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం వెనుక విద్రోహ కోణం దాగి ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రమాదానికి బాణసంచా అంటుకోవడం ఓ కారణమైనప్పటికీ, బాంబు పేలుళ్లు కూడా సంభవించి ఉండవచ్చన్న అనుమానాలతో అధికారులు సోదాలను ముమ్మరం చేశారు.
మరోవైపు, ఈ ప్రమాదానికి సంబంధించి ఐదుగురు ఆలయ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కేరళలోని కొల్లంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై భారత సంతతికి చెందిన ఓ బ్రిటన్ ఎంపీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమని ఇండో-బ్రిటిష్ ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ అధ్యక్షుడు, బ్రిటన్ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బ్రిటిష్ లేబర్ పార్టీకి చెందిన వీరేంద్ర శర్మ ఈలింగ్ సౌతాల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.