"గంగలో మునిగితే పేదరికం పోతుందా..?"
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా క్రతువులో భాగంగా బీజేపీ నేతలు గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో మునిగి పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయితే ఈ విధానంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. గంగలో మునిగితే "దేశంలోని పేదరికం పోతుందా.. పేదల కడుపు నిండుతుందా..?" అని ప్రశ్నించారు.
పబ్లిసిటీ కోసమే..
బీజేపీ నేతలు కేవలం పబ్లిసిటీ కోసమే గంగలో మునుగుతున్నారని మండిపడ్డారు. అయితే తాను ఎవరి నమ్మకాలకు భంగం కలిగించడం లేదన్నారు. మధ్యప్రదేశ్ లోని మౌ నగరంలో నిర్వహించిన "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" ర్యాలీలో భాగంగా నిర్వహించిన సభలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధకలిగించి ఉంటే క్షమించాలని కోరారు.

"పేద పిల్లలు బడికి వెళ్లడం లేదు. ప్రజలకు సరైన ఆహారం అందడం లేదు. శ్రామికులకు వేతనాలు అందడం లేదు. ఇలాంటి సమయంలో వేలకోట్లు ఖర్చు చేసి మహాకుంభమేళాలో బీజేపీ నేతలు హడావిడి చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు." అని మండిపడ్డారు. మీడియా ముందు ఆర్భాటం కోసమే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇలాంటి వ్యక్తులతో దేశం ముందుకెళ్లదన్నారు. మతం పేరుతో కొన్ని శక్తులు పేదలను హింసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి ఇవాళ త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు చేశారు. ఈ క్రమంలో ఖర్గే వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. బీజేపీ-ఆర్ఎస్ఎస్ నేతలు దేశ ద్రోహులు, స్వాతంత్ర్యం కోసం ఎటువంటి పోరాటం కూడా చేయలేదని' మల్లికార్జున ఖర్గే విమర్శలు చేశారు. ఇక ఈ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications