నటి ఖుష్బూకు షాక్: నో పాస్పోర్టు, ఎందుకు?
సినీ నటి ఖుష్బూ పాస్పోర్టును పునరుద్ధరించడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు అయి ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నై: సినీనటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పాస్పోర్టును పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమెపై మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో చెన్నై రీజినల్ పాస్పోర్టు కార్యాలయం కొత్త పాస్పోర్టు పుస్తకాన్ని ఇచ్చేందుకు తిరస్కరించింది.
తనపై నమోదైన కేసులన్నీ ఎన్నికలకు సంబంధించినవేననీ, అందులోనూ వాటిపై హైకోర్టు స్టే విధించింది కదా అని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్పోర్టును పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించాలంటూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

తన పాస్పోర్టు 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందనీ, తరచూ విదేశీ పర్యటనల వల్ల ప్రస్తుతం పాస్పోర్టు పుస్తకంలోని అన్ని పేజీలు స్టాంప్ చేసి ఉన్నాయని ఆమె తెలిపారు. కాంగ్రెసుకు ప్రచారం చేస్తున్న క్రమంలో తనపై తప్పుడు కేసులు బనాయించారని ఆమె అంటున్నారు.
కాగా గత ఎన్నికల సందర్భంగా ఆమెపై అండిపట్టి పోలీస్ స్టేషన్లో 'క్రిమినల్' కేసు నమోదై ఉందనీ... దీని కారణంగా తాము పాస్పోర్టును పునరుద్ధరించలేమని అధికారులు ఖుష్బూకి తెలిపారు.












Click it and Unblock the Notifications