అమానుషం: తినే ప్లేట్స్తో మలాన్ని ఎత్తించి!, ఓ పాఠశాల నిర్వాకం?..
మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు.
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ పాఠశాల సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. స్వచ్చతపై అవగాహన పేరుతో విద్యార్థులతో తినే ప్లేట్లతో టాయిలెట్స్ క్లీన్ చేయించారు.
విద్యార్థులు మధ్యాహ్నా భోజనం కోసం ఉపయోగించే ప్లేట్లను ఇలా ఉపయోగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో గత గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.

పాఠశాల యాజమాన్యం చేసిన నిర్వాకాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులతో చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ విచారణకు ఆదేశించారు.
ఘటనపై ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు. టాయిలెట్ లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తన కూతురు తెలిపిందన్నారు. అప్పటికే పాఠశాల మూసేశారని, వారిని నిలదీసేందుకే ఆందోళన చేపట్టామని అన్నారు.
ఖండించిన యాజమాన్యం:
పాఠశాల యాజమాన్యం మాత్రం తమపై వస్తోన్న ఆరోపణలను ఖండించింది. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ రాకేశ్ తెలిపారు. పాఠశాలలో ఉన్నది ఒకటే టాయిలెట్ అని అలాంటప్పుడు విద్యార్థులతో క్లీన్ చేయించాల్సిన అవసరమేముంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications