కిరాతక క్రీడలు: కామపిశాచులు, కాదంటే మలం
అలీబాగ్: మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ సిగ్గుపడాల్సిన ఉదంతం చోటు చేసుకుంది. ఐదు నుంచి పదిహేనేళ్ల వయసున్న పిల్లలపై అసహజ లైంగిక అకృత్యాలకు పాల్పడుతూ వాటిని చిత్రీకరించి బెదిరింపులకు దిగుతూ నీలిచిత్రాలు చూపి అందులోలాగా చేయాలని వేధించడం వంటివి చేస్తూ వస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలా చేయడానికి నిరాకరించిన వారితో కుక్క మలం తినిపించే దుర్మార్గానికి కూడా కిరాతకులు ఒడిగట్టారు.
పేదపిల్లలకు చదువు చెప్పి నీడ కల్పిస్తామంటూ స్వచ్ఛందసంస్థ స్థాపించి పిల్లల జీవితాలతో కీచకులు ఆడుకుంటున్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా కర్జాత్ తాలూకా తక్వే గ్రామంలో ఈ సంఘటన వెలుగు చూసింది. పుణెకు చెందిన అజిత్ దబోల్కర్ (52) అనే వ్యక్తి 2002లో చంద్రప్రభ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.

పిల్లలకు చదువు చెప్పి, ఆశ్రయమిచ్చేందుకు దాన్ని తక్వేలో స్థాపించాడు. అందులో ఉండేవారంతా 5-15 ఏళ్ల లోపు పిల్లలు. దబోల్కర్ తన సహాయకురాలైన లలితా తోండేతో కలిసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అంగచూషణ చేయాలంటూ బలవంతపెట్టేవాడు. అలాంటి పనులు చేయలేమంటూ వారు ఏడిస్తే మలం తినాలంటూ దారుణమైన శిక్ష విధించేవాడు. అతడి అకృత్యాలకు బలైన వారిలో ఇద్దరు చిన్నారులు పుణేలోని జ్ఞాన్దేవి చైల్డ్లైన్ గ్రూపునకు చెందిన డాక్టర్ అనూరాధ సహస్రబుద్ధే ఇంటిలో పనిచేసే మహిళ కూతుళ్లు.
వేసవి సెలవులకు ఇంటికి వచ్చిన వారు తమ తల్లితో కలిసి తన ఇంటికి వచ్చినప్పుడు మౌనంగా, దిగులుగా ఉండటం చూసిన అనూరాధకు సందేహం వచ్చింది. వారిని బుజ్జగించి అలా ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తే అజిత్ దబోల్కర్ దుర్మార్గాలు బయటపడ్డాయి. వెంటనే ఆమె మహారాష్ట్ర ప్రభుత్వ బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరితో పాటు ఆశ్రమ శాలలోని మరో ముగ్గురు బాధితులతోనూ మాట్లాడి వారి ఫిర్యాదు మేరకు దబోల్కర్ను, లలితా తోండెను అదుపులోకి తీసుకున్నారు.
షెల్టర్ హోమ్స్లో సీసీ టీవీలు: మహిళా, శిశు సంక్షేమ శాఖ
దబోల్కర్ దారుణకృత్యాలు బయటపడిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వేగంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ఉన్న అలాంటి షెల్టర్ హోమ్స్ అన్నింటిలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications