కత్తితో సీఎం ఇంటిలోకి: పట్టుకున్న పోలీసులు
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం కావేరిలోకి కత్తితో ప్రవేశించడానికి ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. అయితే సీఎం ఇంటి దగ్గర ఉన్న భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అతనిని క్షుణ్ణంగా పరిశీలించగా విషయం వెలుగు చూసింది.
బెంగళూరు నగరంలోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య అధికారిక నివాసం (కావేరి) ఉంది. సోమవారం మైసూరు జిల్లా టీ. నరశీపురాకు చెందిన లింగరాజు (54) అనే వ్యక్తి కావేరి దగ్గరకు వెళ్లాడు.
తరువాత సీఎం ఇంటి పరిసర ప్రాంతాలలో ఓ తెల్లకాగితం పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. సీఎం ఇంటి ముందు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయిన పోలీసులకు అనుమానం వచ్చింది. అదే సమయంలో లింగరాజు సిద్దరామయ్య ఇంటిలోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేశాడు.
పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని చేతిలో ఉన్న తెల్లకాగితం తీసుకుని చూశారు. అందులో నాలుగైదు లైన్ల వ్యాఖ్యలు వ్రాసిన విషయం గుర్తించారు. చివరికి అతని దుస్తులు పరిశీలించడంతో ఓ కత్తి బయటపడింది.
అతనిని విచారణ చెయ్యగా టీ. నరశీపుర నివాసి లింగరాజు అని వెలుగు చూసింది. లింగరాజు కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే కొంత కాలంగా లింగరాజు మానసిక అస్వస్థతతో బాధపడుతున్నాడని వెలుగు చూసిందని, కేసు నమోదు చేశామని హై గ్రౌండ్స్ పోలీసు అధికారులు తెలిపారు.