అయ్యప్ప స్వాముల బస్సులో చెలరేగిన మంటలు: పూర్తిగా దగ్ధం
Sabarimala: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు సన్నద్ధమౌతోన్నారు. కార్తీక మాసం ఆరంభమైన నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.
మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు పీఎన్ మహేష్ నంబూద్రి ఆలయం గర్భగుడి తలుపులను తెరిచారు. స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది.

ఈ నేపథ్యంలో శబరిమలకు వెళ్లే భక్తుల కోసం కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్సులో మంటలు చెలరేగాయి. అంతకంతకూ చెలరేగుతున్న అగ్నికీలలను ఆర్పివేయడానికి డ్రైవర్, కండక్టర్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఆ సమయంలో బస్సులో అయ్యప్ప స్వామి భక్తులెవరూ లేరు. నీలక్కల్ నుంచి పంపా మధ్య రాకపోకలు సాగించే కేఎస్ఆర్టీసీ పెరంబవూర్ డిపోనకు చెందిన షటల్ సర్వీస్ బస్సు ఇది. ఈ తెల్లవారు జామున పంపా నుంచి నీలక్కల్కు బయలుదేరింది. నీలక్కల్లో వేచి చూస్తోన్న అయ్యప్ప స్వాములను పంపాకు తరలించాల్సి ఉంది.
మార్గమధ్యలో అట్టథోడు- చాళక్కాయం మధ్య ఘాట్ సెక్షన్లో ప్రయాణిస్తోన్న సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. ఇంజిన్ నుంచి దట్టమైన నల్లటి పొగ వెలువడింది. దీనితో డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. బస్సును అక్కడే నిలిపివేశాడు. ఇంజిన్ నుంచి చెక్ చేస్తోండగా భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. డ్రైవర్, కండక్టర్ మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. పూర్తిగా దగ్ధమైంది.
వెంటనే డ్రైవర్ నీలక్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రావెన్కూర్ దేవస్వొం బోర్డు సభ్యుడు అజిత్ కుమార్, పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేశారు.












Click it and Unblock the Notifications