సొంతింటికి వచ్చాను: హస్తం గూటికి ఖుష్బూ, డీఎంకేపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నటి, తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మహిళా నేత ఖుష్బూ బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అంతకుముందు ఆమె ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం అధ్యక్షురాలి సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటించారు. సోనియా సమక్షంలో తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు. తమిళనాట కాంగ్రెస్ పార్టీ బలపడుతుందన్నారు. ఇప్పుడు తనకు తన సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందన్నారు. అదే సమయంలో డీఎంకే పార్టీ పైన నిప్పులు చెరిగారు. తనకు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. తమ కుటుంబ సభ్యులు మొదటి నుండి కాంగ్రెస్ అభిమానులే అన్నారు.
డీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆరునెలల తరువాత ఖుష్బూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఖుష్బూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారని తమిళనాట ఊహాగానాలు వెల్లువెత్తాయి. కానీ హస్తం దరికి చేరారు. ఖుష్బూ చేరికతో తమిళనాట కాంగ్రెస్ కార్యకర్తలకు ఊపొస్తుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెసు ఖుష్బూ చేరికతో కొత్త ఊపిరి ఖాయమని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు అంటన్నారు.
అంతకుముందు పీసీసీ అధ్యక్షుడు ఇళంగోవన్ మాట్లాడుతూ.. ఖుష్బూ తమ పార్టీలో ఆమె సభ్యురాలు కాబోతున్నట్టు తెలిపారు. ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో ఖుష్బూ తమ పార్టీలో చేరబోతున్నారని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.