శాంతిని భగ్నం చేసే కుట్ర అట: ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ నేతలపై ఎఫ్ఐఆర్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితుల వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ మెడకే చుట్టుకుంది. ఎనిమిది మంది మరణానికి కారణమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, దాన్ని వైరల్గా మార్చారనే కారణంతో పోలీసులు కాంగ్రెస్ సీనియర్ నేతలపై కేసు నమోదు చేశారు. దీనితోపాటు- ప్రియాంక గాంధీ వాద్రా అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోండటం వంటి కారణాల కింద కేసు పెట్టారు. శాంతియుత వాతావరణాన్ని భగ్నం చేసే కుట్ర కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో దీన్ని పోస్ట్ చేసింది. 27 సెకెన్ల నిడివి ఉన్న వీడియో ఇది. జెండాలను పట్టుకుని ముందుకు నడుస్తోన్న రైతులపై ఓ నల్లరంగు ఎస్యూవీ కారు దూసుకెళ్లడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. తొలుత తెల్లరంగు షర్ట్, లేత ఆకుపచ్చని తలపాగాను ధరించిన ఓ వృద్ధుడిని ఢీ కొట్టడం, అతను ఎగిరి బోనెట్ మీద పడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విడుదల చేసిన మరుసటి రోజే ఈ కేసులు నమోదయ్యాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా సహా 11 మందిపై సీతాపూర్ జిల్లాలోని హర్గావ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొద్దిసేపటి కిందటే ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలను సంధించిన విషయం తెలిసిందే.
లఖింపూర్ ఖేరిలో నలగురు రైతుల మరణానికి కారణమైన వ్యక్తిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ఎలాంటి కేసు నమోదు చేయకుండా తనను 28 గంటలుగా ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. ఆ వీడియోను ప్రియాంక గాంధీ విడుదల చేసిన రెండు-మూడు గంటల వ్యవధిలోనే ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, దీపేంద్ర హూడాతో పాటు మరి కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు నమోదైందని సీతాపూర్ జిల్లా హర్గావ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.












Click it and Unblock the Notifications