జైల్లో ఉన్నా.. మనసంతా ఎన్నికల పైనే... పొద్దంతా టీవీ చూస్తూ లాలూ... గెలుపుపై ధీమా...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి లాలూ ప్రసాద్ యాదవ్ లేకుండానే ఆర్జేడీ ఎన్నికలను ఎదుర్కొంటోంది. గత నాలుగు దశాబ్దాల్లో లాలూ ప్రసాద్ లేకుండా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం ఇదే మొదటిసారి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినప్పటికీ.. మహాకూటమి తరుపున ప్రచారంలో పాల్గొన్నారు.కానీ ఈసారి జైల్లో ఉండాల్సి రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా పోయింది.
బీహార్ ఎన్నికల్లో 'భురాబల్'పై హాట్ చర్చ... తేజస్విపై ఎక్కుపెట్టిన బీజేపీ... అసలేంటీ వ్యవహారం...
ఎప్పుడూ టీవీ చూస్తూ...
పశువుల దానా కుంభకోణం కేసులో లాలూ జార్ఖండ్లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలలుగా రాంచీలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష అవకాశం లేకపోయినప్పటికీ.. లాలూ టీవీ ద్వారా బీహార్ ఎన్నికలను నిశితంగా గమనిస్తున్నట్లు జైలు అధికారులు చెప్తున్నారు. 'లాలూ జీ ఎప్పుడూ టీవీ చూస్తూనే ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా టీవీని వదలరు. పత్రికలు ఎక్కువగా చదవరు.. కానీ కొన్నిసార్లు నర్సులను పత్రికల్లో హెడ్లైన్స్ చదవమని అడుగుతుంటారు.' అని బిర్సా ముండా సెంట్రల్ జైలు అధికారి తెలిపారు.
నెల క్రితం కలిసిన తేజ్ ప్రతాప్...
'ఒకసారి రిమ్స్లో లాలూ ఉన్న వార్డుకు వెళ్లాను. అప్పుడు ఆయన భోజనం చేస్తూ టీవీలో తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఎన్నికల ర్యాలీని చూస్తున్నారు.' అని ఆ అధికారి పేర్కొన్నారు.
జైల్లో లాలూ సెల్ఫోన్ వాడట్లేదని... వారానికోసారి మాత్రమే సందర్శకులను ఆయనతో కలిసేందుకు అనుమతిస్తున్నామని చెప్పారు. కొద్దిరోజుల క్రితమే కొంతమంది పార్టీ కార్యకర్తలు వచ్చి కలిసినట్లు చెప్పారు. మహాకూటమి అభ్యర్థి తేజస్వి యాదవ్,లాలూ సతీమణి,ఆయన కుమార్తెలు జైలుకు వచ్చి రెండు నెలలు పైనే అయిందన్నారు. నెల క్రితం లాలూ పెద్ద కుమారుడు జైలుకు వచ్చి ఆయన్ను కలిసినట్లు చెప్పారు.
గెలుపుపై లాలూ ధీమా..
జార్ఖండ్ ఆర్జేడీ యువ విభాగం అధ్యక్షుడు అభయ్ సింగ్ మాట్లాడుతూ... బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయంపై లాలూ ధీమాతో ఉన్నారని చెప్పారు. 'వచ్చేది మన ప్రభుత్వమేనని లాలూ చెప్తున్నారు.. ఎన్నికలకు సంబంధించిన ప్రతీ వార్తను ఆయన గమనిస్తూనే ఉన్నారు.. ఆయనలో ఎలాంటి ఆందోళన లేదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నారు...' అభయ్ సింగ్ తెలిపారు.
Recommended Video
నవంబర్ 9న బెయిల్...!!
లాలూ ప్రసాద్ యాదవ్ నవంబర్ 9న బెయిల్పై విడుదలవుతున్నారని... ఆ మర్నాడే నవంబర్ 10న నితీశ్ కుమార్కు వీడ్కోలు అని తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నవంబర్ 10న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తేజస్వి ఆ వ్యాఖ్యలు చేశారు. లాలూకు బెయిల్పై ఆయన న్యాయవాదులు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే లాలూ సగం జైలు శిక్ష పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చి తీరుతుందని చెప్తున్నారు. 1990ల నుంచి లాలూను పశువుల దానా కుంభకోణం కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పుకుని తన సతీమణి రబ్రీ దేవిని ముఖ్యమంత్రిని చేశారు. 2017లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూను దోషిగా తేల్చింది. ఆ తర్వాత జనవరి,2018లో ఆయనకు మూడున్నరేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. దీంతో లాలూ జైలుకు వెళ్లక తప్పలేదు.