ఉరికొయ్యకు వేలాడిన కామాంధులు: చివరి రెండు గంటల్లో ఏం జరిగిందంటే..!
న్యూఢిల్లీ: దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో నలుగురు దోషులు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్లకు ఉరిశిక్షను విధించారు. ఈ తెల్లవారు జామున సరిగ్గా 5:32 నిమిషాలకు నలుగురు దోషులను ఉరిశిక్ష పడింది. నలుగురి మృతదేహాలను ప్రత్యేక టన్నెల్ ద్వారా బయటికి తరలించారు.
రాత్రంతా హైడ్రామా..
ఉరిశిక్షను తప్పించుకోవడానికి నలుగురు దోషులు చివరి సమయంలో కూడా చేయని ప్రయత్నమంటూ లేదు. నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ కుమార్ శర్మ దాఖలు చేసిన పిటీషన్పై బుధవారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. సుమారు 90 నిమిషాల పాటు విచారణ కొనసాగించింది. నిందితుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ చేసిన వాదనలతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఏకీభవించలేదు. పిటీషన్ను కొట్టేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి మన్మోహన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల తరువాత కూడా నిర్భయ కుటుంబానికి న్యాయం జరగలేదనే విషయాన్ని విస్మరించకూడదని పేర్కొన్నారు.
అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు..
ఢిల్లీ హైకోర్టు పిటీషన్ను కొట్టేసిన వెంటనే నిందితుల తరఫు న్యాయవాది దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ పిటీషన్పై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు తెల్లవారు జామున 3 గంటలకు ప్రత్యేకంగా సమావేశమైంది. వారి వాదనలను ఫలించలేదు. ఈ విచారణ కోసం నిర్భయ తల్లి ఆశాదేవి, ఇతర కుటుంబ సభ్యులు సైతం హాజరు అయ్యారు. సుప్రీంకోర్టు పిటీషన్ను కట్టేసిన వెంటనే ఆశాదేవీ హర్షం వ్యక్తం చేశారు.
ఎరుపు రంగుదుస్తుల్లో..
ఉరిశిక్షను ఎదుర్కొనడానికి ముందురోజు నిందితులకు ఎరుపురంగు దుస్తులను ధరింపజేసినట్లు తెలుస్తోంది. డేంజర్ జోన్లో ఉన్నారనే భావన తోటి ఖైదీల్లో కలిగించడానికే ఈ చర్యను చేపట్టారు తీహార్ కేంద్ర కారాగారం అధికారులు. ఒకవంక సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న సమయంలోనే తీహార్ జైలులో ఉరిశిక్ష ప్రక్రియ ఆరంభమైంది. ఈ సందర్భంగా కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.
Recommended Video
భగవద్గీత శ్లోకాలు పఠిస్తూ..
తెల్లవారు జామున 3:15 నిమిషాలకు నలుగురు నిందితులను నిద్ర లేపారు అధికారులు. వారికి తలంటు స్నానం చేయించారు. అనంతరం వారి కోరిక మేరకు ప్రత్యేక పూజలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంతకుముందే- ప్రత్యేక పూజల కోసం ఓ పండితుడిని కూడా జైలులో అందుబాటులో ఉంచారు. పూజల అనంతరం జైలు అధికారులు వారికి వైద్య పరీక్షలను నిర్వహించారు. శారీరకంగా పూర్తిగా దృఢంగా ఉండటంతో ఉరిశిక్షను అమలు చేయొచ్చని నిర్ధారించారు. అనంతరం అల్పాహారాన్ని అందించగా.. బలవంతంగా దాన్ని తిన్నారు. అనంతరం మూడో నంబర్ జైలులో ఉరికంబం ఎక్కారు.