అసద్ సాబ్.. వినడం నేర్చుకోండి, ఎన్ఐఏ సవరణ బిల్లు సందర్భంగా అమిత్ షా
న్యూఢిల్లీ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సభలో ప్రవేశపెట్టబోయే సమయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. బిల్లు గురించి సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రతిపాదించారు. దీనిపై బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ చర్చిస్తుంటే .. విపక్ష కాంగ్రెస్ సభ్యులు సహా, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడ్డుతగిలారు. దీంతో హోంశాఖ మంత్రి అమిత్ షా కల్పించుకున్నారు. మంత్రి చెప్పేది సంయమనంతో వినాలని సూచించారు.
మాటలు-మంటలు
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టి, చేధిస్తున్న ఎన్ఐఏను మరింత బలోపేతం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయిచింది. ఇందుకోసం లోక్సభలో ఎన్ఐఏ విధులకు సంబంధించి సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సవరణలో చేర్చిన అంశాలను అంతకుముందు సభకు కిషన్ రెడ్డి వివరించారు.

తర్వాత సత్యపాల్ సింగ్ మాట్లాడుతుండగా ఇంతలో అసదుద్దీన్ ఒవైసీ కల్పించుకున్నారు. పదే పదే అడ్డుకోవడంతో .. అమిత్ షా కల్పించుకున్నారు. అసద్ సాబ్.. చర్చించే అంశాలను వినండి. విని నేర్చుకోవాలే తప్ప పదే పదే సభను అడ్డుకోవడం సరికాదని సూచించారు.
దేశంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ విచారణ చేపడుతుంది. అయితే విదేశాల్లో కూడా విచరాణ చేపట్టేందుకు అధికారం కల్పిస్తూ కేంద్రం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది దేశం, జాతి, ప్రజల ప్రయోజనాల కోసం చేపడుతున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఉగ్రవాదం తీవ్ర సమస్యగా మారిందని, ఈ విషయం సీనియర్ నేతలకు కూడా తెలుసన్నారు. ఈ కొత్త సవరణ బిల్లుతో దేశంలోనే గాక విదేశాల్లో కూడా ఎన్ఐఏ విచారణ చేపట్టేందుకు అధికారం ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు ఆయుధాల, మనుషుల అక్రమ రవాణాపై కూడా ఫోకస్ చేస్తామని తెలిపారు. జాతి భద్రత దృష్ట్యా ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications