ఫాల్కే అవార్డు గ్రహీత, గాయకుడు మన్నాడే ఇక లేరు
బెంగళూర్: ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకుడు, ఫాల్కే అవార్డు గ్రహీత మన్నాడే గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. కర్ణాటక రాజధాని బెంగళూర్లో ఆయన తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధమైన సమస్యతో, మూత్రపిండాల వైఫల్యంతో ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దికాలంగా ఆయన వెంటిలేటర్పై ఉంటూ వచ్చాడు.

అభిమానుల తుదిచూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని రవీంద్ర కళా క్షేత్రంలో ఉంచుతారు. తన కూతురితో పాటు ఆయన బెంగళూర్లో స్థిరపడ్డారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఇటీవల పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పలకరించారు.
అత్యంత ప్రతిభావంతుడైన మన్నాడే హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళీ, కన్న, అస్సామీ భాషా చిత్రాల్లో పాటలు పాడారు. బోజ్పురి, అవధి, మగధ్, పంజాబీ, మైథిలీ, కొంకణి, సింధ్రీ, చత్తీస్గరీ భాషా చిత్రాల్లో కూడా ఆయన గేయాలు ఆలపించారు.
1942లో తమన్నా సినిమాతో మన్నాడే సినీ రంగ ప్రవేశం చేశారు. 1942 నుంచి 2013 వరకు ఆయన 4 వేలకు పైగా పాటలను రికార్డు చేశారు. 1953, 1976 మధ్య కాలంలో మన్నాడేకు సువర్ణయుగం. ఆయనకు 1971లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్, 2007లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు లభించాయి. మన్నాడే మృతికి కేంద్ర మంత్రి మనీష్ తివారీ సంతాపం ప్రకటించారు.












Click it and Unblock the Notifications