జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ రణరంగం, ఎమ్మెల్యేకు గాయాలు
శ్రీనగర్: ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాంతాల్లో కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు మంగళవారం సభా కార్యక్రమాలు సాగనివ్వకపోవడంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రణరంగంగా మారింది. కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల పట్ల వివక్షను ప్రదర్శించిందని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన పిడిపి సభ్యులు వెల్లోకి దూసుకు వచ్చి గొడవ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
వారిని బలవంతంగా బైటికి పంపంచడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందికి, పిడిపి ఎమ్మెల్యేలకు మధ్య జరిగిన గొడవలో పిడిపి ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మద్ షా గాయపడ్డారు. ఈ గొడవతో సభ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండానే వాయిదా పడింది.
మంగళవారం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకురాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలో పిడిపి ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో లేచి నిలబడి కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వివక్షను ప్రదర్శించిందని పేర్కొనే ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు వెల్లోనికి దూసుకెళ్లి గొడవ చేయడం ప్రారంభించారు. గొడవ చేస్తున్న సభ్యులను బైటికి పంపించి వేయడానికి స్పీకర్ ముబారక్ గుల్ మార్షల్స్ను పిలిపించడంతో సభ్యులకు, వారికి మధ్య గొడవ ప్రారంభమైంది.
బిజెపి, జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీకి చెందిన సభ్యులు, కొంతమంది స్వతంత్ర సభ్యులు కూడా పిడిపి సభ్యులతో గొంతు కలుపుతూ ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం తమ ప్రాంతాల పట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. చివరికి డిప్యూటీ స్పీకర్ సర్తాజ్ మద్ని సైతం నిరసనగా తన స్థానంలో లేచి నిలబడ్డారు. సభ్యులను శాంతపర్చడానికి స్పీకర్ చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో మొదట 15 నిమిషాలు, ఆ తర్వాత మరోసారి మరో పావుగంట సభను వాయిదా వేశారు.
రెండోసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైనప్పుడు పిడిపి ఎమ్మెల్యే ముస్తాక్ అహ్మద్ షాను ఒక మార్షల్ నెట్టివేయడంతో ఒక కుర్చీపై పడిపోవడంతో స్వల్పంగా గాయపడ్డారు. దీంతో పిడిపి ఎమ్మెల్యేలు రెచ్చిపోయి కుర్చీలు, టేబుళ్లు, మైకులు మార్షల్స్పై విసిరేయడం మొదలుపెట్టారు. ఒక దశలో సభలో ఏం జరగుతోందో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
కాగా అసెంబ్లీలో గొడవపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ, కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారని, ఈ నిర్ణయంతో ప్రతిపక్షం పూర్తిగా వణికిపోతున్నట్లు కనిపిస్తోందని, పిడిపి సభ్యులు తమ ప్రవర్తనకు సిగ్గుపడాలన్నారు. ఒమర్ వ్యాఖ్యలపై మెహబూబా ముఫ్తీ మండిపడుతూ.. సభకు రావడానికి బదులు ఒమర్ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేస్తున్నారని, తామెందుకు సిగ్గుపడాలన్నారు.