ఫామ్ హౌజ్ లో కాళ్లు చేతులు నరికేశారు
చండీగడ్: పంజాబ్ లో దారుణం జరిగింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఫామ్ హౌజ్ లో ఇద్దరి కాళ్లు, చేతులు నరికేశారు. చికిత్స విఫలమై ఒకరు మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పంజాబ్ లోని పజిల్కా జిల్లాలోని అబోహర్ ప్రాంతంలో అక్కడి అధికార పార్టీ అకాలీదళ్ నేత శివలాల్ దోడా అనే వ్యక్తి ఫామ్ హౌజ్ ఉంది. ఈ ఫామ్ హౌజ్ లో శనివారం బీమ్ టంక్ అనే వ్యక్తి రెండు కాళ్లు, చేతులు నరికేశారు.
తరువాత గుర్జిత్ సింగ్ అనే వ్యక్తి ఓ చెయ్యి, కాలు నరికేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో బీమ్ టంక్ అనే వ్యక్తి మార్గం మద్యలో మరణించాడు. గుర్జిత్ సింగ్ అమృత్ సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గుర్జిత్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. నరబలి కోసం ఇద్దరిని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దారుణ సంఘటనపై పంజాబ్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి అకాలీదళ్ నేత శివలాల్ దోడా, ఆయన మేనల్లుడితో సహా మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేశామని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఎలాంటి అరెస్టులు చెయ్యలేదని పోలీసులు తెలిపారు.