మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితా రిలీజ్.. వారిని పట్టిస్తే భారీ నజరానాలు: ఎన్ఐఏ
మావోయిస్టు పార్టీ నేతలకు చెక్ పెట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ప్రకటించింది. చత్తీస్ గడ్ లో 2013లో జరిగిన జీరంఘట్టి దాడిలో ప్రమేయం ఉన్న 21 మంది మావోయిస్టులపై 1.25 కోట్లకు పైగా రివార్డులు ప్రకటిస్తూ ఎన్ఐఏ మూడు రోజుల క్రితం జాబితాను విడుదల చేసింది. మావోయిస్టు ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఎన్ఐఏ చేసిన ఈ సంచలన ప్రకటన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కలకలం రేపింది.
21 మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాను విడుదల చేసిన ఎన్ఐఏ
దండకారణ్యంలోని మావోయిస్టుల తలలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రివార్డులు ఇస్తామని ప్రకటించింది. 2013 మే 25న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జిరంఘట్టి ఘటనలో విచారణలో ఉన్న 21 మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుల జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది. సమాచారం అందించిన వారిని గుర్తించి వారికి లక్షల్లో రివార్డు ఇస్తామని, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఇక ఎన్ఐఏ ప్రకటించిన మావోయిస్టు పార్టీ నేతలు వివరాలు చూస్తే
మావోయిస్ట్ కీలక నేతల తలలపై భారీగా రివార్డులు.. బసవరాజ్ కు 50 లక్షలు, హిడ్మాకు 25 లక్షలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవ రావు అలియాస్ బస్వరాజు అలియాస్ గంగన్నను పట్టిస్తే అత్యధికంగా 50 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది. ఇక మావోయిస్టు పార్టీ కమాండర్ హిడ్మాను పట్టిస్తే 25 లక్షల రూపాయల రివార్డు ఇస్తామని వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు కోరుట్లకు చెందిన తిరుపతి అలియాస్ దేవ్ జీ ని, నల్గొండ జిల్లా చుండూరు కు చెందిన పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ లను పట్టించిన వారికి ఏడు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది.
జీరంఘట్టి మావోల దాడి కేసులో నిందితుల తలలపై రివార్డులు
ఇక చత్తీస్ గడ్ కు చెందిన మరో నలుగురు భగత్ హేమల అలియాస్ భద్రు, బార్సే సుక్క అలియాస్ దేవా, మాండవి జయలాల్ అలియాస్ గంగ , సోమా సోడి అలియాస్ సురేందర్ లపై 5 లక్షల రూపాయలు, మరో ముగ్గురిపై రెండున్నర లక్షల రూపాయలు రివార్డులు ఇస్తామని ప్రకటించింది. అంతేకాదు మరో ఎనిమిది మంది పై లక్ష రూపాయల చొప్పున, మరో ఇద్దరిపై 50 వేల చొప్పున రివార్డులు ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
ఇప్పటికే మావోయిస్ట్ అగ్రనేతలపై బస్తర్ పోలీసులు కోటి రివార్డ్.. మళ్ళీ ఎన్ఐఏ ప్రకటన
ఇదిలా ఉంటే గతంలోనే బస్తర్ పోలీసులు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, కటకం సుదర్శన్, మల్లోజు వేణుగోపాల్ రావు లపై కోటి రూపాయల చొప్పున రివార్డులను ప్రకటించారు. ఇక తాజాగా బసవరాజు పై జాతీయ దర్యాప్తు సంస్థ అదనంగా 50 లక్షల రూపాయలు ఇస్తామని రివార్డును ప్రకటించింది.
మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మా సల్వాజుడుంను ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు మహేంద్ర ఖర్మతో పాటు 32 మందిని మావోయిస్టులు జీరంఘట్టిలో హతమార్చారు. ఇక ఈ కేసులోనే దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ, మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలను పట్టిస్తే రివార్డులు ఇస్తామని ప్రకటన చేసింది.