18 ఏళ్లలోపువారు అలా చేయడం చట్ట విరుద్ధం: హైకోర్టు కీలక తీర్పు
లక్నో: మైనర్ల సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 18 ఏళ్ల లోపు వారు సహజీవనం చేయడం చట్ట విరుద్ధం, అనైతికమని హైకోర్టు స్పష్టం చేసింది. సహజీవనాన్ని వివాహపరమైన సంబంధంగా పరిగణించేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది.
18 ఏళ్లలోపు ఉన్న అబ్బాయి.. తనకంటే వయస్సులో తన కంటే పెద్దదైన ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడనే కారణంతో నేర విచారణ నుంచి రక్షణ పొందలేడని, వారి చర్యలు చట్టపరమైనవి కాదని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్టిస్ రాజేంద్ర కుమార్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ మేరకు దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అబ్బాయి ఇంట్లోంచి వచ్చి ప్రయాగ్రాజ్లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో అమ్మాయి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు ఇద్దరినీ బలవంతంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు.
అక్కడ్నుంచి తప్పించుకున్న అమ్మాయి.. జరిగిన ఘటన మొత్తాన్ని అబ్బాయి తండ్రికి తెలియజేసింది. దీంతో ఆయన అబ్బాయి తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతోపాటు అబ్బాయిపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు.. 18 ఏళ్లలోపు వారు సహజీవనం చేయడం అనైతికమని, చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది.
ఇద్దరు వ్యక్తులు తమ ఇష్టపూర్వకంగా జీవించేందుకు హక్కు ఉంటుందని.. అయితే, వారు మేజర్లు అయి ఉండాలని హైకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. అమ్మాయి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో నమోదైన కేసులో అబ్బాయిపై మోపిన నేరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు కోర్టుకు సమర్పించని కారణంగా.. నేరం జరిగిందనే అభిప్రాయానికి రాలేమని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications