అద్వానీ ప్రశంస: భోపాల్ ర్యాలీలో మోడీ పాదాభివందనం
భోపాల్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పైన ఆ పార్టీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ బుధవారం ప్రశంసలు కురిపించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ ర్యాలీలో అద్వానీ, మోడీ తదితరులు పాల్గొన్నారు. భోపాల్ ర్యాలీకి ముందు అద్వానీకి మోడీ పాదాభివందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు.
ర్యాలీ సందర్బంగా మోడీ పైన అద్వానీ ప్రశంసలు కురిపించారు. గుజరాత్కు మోడీ సుపరిపాలన అందించారన్నారు. మోడీ నాయకత్వం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపితో ఏ ఇతర పార్టీ పోటీ పడలేదన్నారు. సుస్థిర పాలన బిజెపితోనే సాధ్యమన్నారు.

తమ హయాంలో అందించిన సుపరిపాలననే తమను గెలిపిస్తుదన్నారు. ఈ ర్యాలీ దేశానికే కాకుండా ప్రపంచానికే సంకేతమన్నారు. ప్రతి కార్యకర్త అవిశ్రాంత కృషి వల్లే బిజెపి ఈ స్థాయికి ఎదిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బిజెపి విజయం కోసం కృషి చేయాలని, మనం గెలుస్తామన్నారు. ఎన్డీయో పాలనతో యూపిఏ స్వప్నంలోనైనా పోల్చుకోజాలదన్నారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ప్రజా మద్దతున్న నాయకుడిగా రుజువయిందని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెసు పార్టీ కంటే తమదే పెద్ద పార్టీ అని చెప్పారు. వాజపేయి పాలనలో ద్వవ్యోల్భణం అదుపులో ఉందని, యూపిఏ పాలనలో అవినీతి, ద్రవ్యోల్భణం పెరిగిందన్నారు.
బిజెపి హయాంలో, బిజెపి రాష్ట్ర పాలిత రాష్ట్రాల్లోని మంత్రుల పైన ఆరోపణలు లేవన్నారు. నరేంద్ర మోడీని ప్రధానమంత్రి కాకుండా ఏ శక్తి ఆపలేదన్నారు. కాగా ర్యాలీలో అద్వానీ, మోడీ, రాజ్ నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మురళీ మనోహర్ జోషీ, అనంత్ కుమార్, వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications