మహారాష్ట్ర నగరాల్లోనూ భారీగా కేసులు: నాగ్పూర్లో మార్చి 15 నుంచి లాక్డౌన్
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముంబైతోపాటు పలు నగరాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా నగరాల్లో మరోసారి లాక్డౌన్ విధించడం లేదా కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతోంది.
తాజాగా, నాగ్పూర్ నగరంలో మార్చి 15 నుంచి 21 వరకు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాగ్పూర్లో బుధవారం ఏకంగా 1710 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారినపడి ఈ నగరంలో ఒక్కరోజే 8 మంది మరణించారు.
అధికారుల జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. పరిశ్రమలు, అత్యవసర సేవలు మినహా అన్ని బంద్ ఉంటాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం సిబ్బందితో తమ కార్యకలాపాలు కొనసాగించాలని ఆదేశించారు. కాగా, మహారాష్ట్రలో ఫిబ్రవరి రెండో వారం నుంచి భారీగా పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. ఏడు పాయింట్లతో యాక్షన్ పాన్ ప్రకటించింది. వీటిలో కరోనా కాంటాక్టులను గుర్తించడం, పరీక్షించడం, హాట్ స్పాట్లలో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, మరణాలను తగ్టించేందుకు అవసరమైన చర్యలు చేపట్టం లాంటివి ఉన్నాయి.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,921 కరోనా కేసులు నమోదు కాగా, 133 మంది మరణించారు. ఒక్క బుధవారం రోజునే 20,652 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.12 కోట్లకు పైబడింది.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కూడా వేగంగా సాగుతోంది. దేశంలో బుధవారం సాయంత్రం వరకు 2.52 కోట్ల మందికి డోసులు తీసుకున్నారు. వీరిలో 71,70,519 ఆరోగ్య సంరక్షణ, 70,31,147 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు మొదటి డోసు ఇవ్వగా, 39,77,407 ఆరోగ్య సంరక్షణ, 5,82,118 మంది ఫ్రంట్లైన్ కార్మికులకు రెండవ మోతాదు ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు 481 లక్షల డోసులను పలు దేశాలకు సరఫరా చేసినట్లు ప్రభుత్వం పార్లమెంటులో తెలిపింది.