Lockdown: దక్షిణ కాశీలో మంత్రి, ఎమ్మెల్యే, ఐపీఎస్, ఐఏఎస్ ల హల్ చల్, నియమాలు గోవిందా గోవింద !
బెంగళూరు/ మైసూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ 5.0 సడలింపుల్లో భాగంగా సోమవారం దేశంలోని ప్రముఖ ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకున్నాయి. 80 రోజులకు పైగా ఆలయాలు మూతపడటంతో భక్తులు ఇంత కాలం ఇష్టమైన దేవుడిని పూజించలేకపోయారు. ఆలయాలు తెరుచుకున్న వెంటనే దక్షిణ కాశీ అని పేరు ఉన్న ప్రముఖ ఆలయంలో మొదటి పూజ చెయ్యడానికి వెళ్లిన మంత్రి, ఎమ్మెల్యే మేము అధికార పార్టీ నాయకులు, మాకు లాక్ డౌన్ నియమాలు వర్తించవు అనే రీతిలో వ్యవహరించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వంతపాడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం నియమాలు గాలికి వదిలేసి గుంపులో గోవిందా గోవింద అంటూ కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా వ్యవహరించారని విమర్శలు మొదలైనాయి.

దక్షిణ కాశీలో పలు రాష్ట్రాల భక్తులు
ప్రపంచ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం కాశీకి ఎంతపేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కర్ణాటకలో మైసూరు సమీపంలోని నంజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయానికి దక్షిణ కాశీ అనే పేరు ఉంది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది భక్తులు నంజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయంలో పూజలు చెయ్యడానికి వస్తుంటారు. లాక్ డౌన్ సందర్బంగా నంజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయం మూతపడింది.

మంత్రిగారి మొదటి పూజ
కేంద్ర ప్రభుత్వం అనుమతితో సోమవారం వేకువ జామున నంజనగూడులోని శ్రీకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు మొదలైనాయి. కర్ణాటక మంత్రి, బెంగళూరులోని యశవంతపుర నియోజక వర్గం ఎమ్మెల్యే ఎస్.టీ. సోమశేఖర్, ఎమ్మెల్యే హర్షవర్దన్ తదితరులు సోమవారం ఉదయం శ్రీకంఠేశ్వర ఆలయంలో మొదటి పూజలు చెయ్యడానికి వెళ్లారు. తరువాత ఆలయంలో మొదటి పూజ కర్ణాటక మంత్రి సోమశేఖర్ చేశారు.

రూలింగ్ పార్టీ లీడర్స్ కు నో కరోనా, సరేనా !
సోమవారం ఉదయం కర్ణాటక మంత్రి ఎస్.టీ. సోమశేఖర్ తో పాటు ఎమ్మెల్యే హర్షవర్దన్, జిల్లాధికారి (ఐఏఎస్) అభిరామ్ జీ. శంకర్, జిల్లా ఎస్పీ రిష్యంత్, తహసిల్దార్ మహేష్ కుమార్ తదితర ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రి, ఎమ్మెల్యేలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు వచ్చారని ప్రత్యేక పూజలు చేశారు.

వాళ్లకు కరోనా రాదా ?
ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు చేసే సమయంలో, దేవుడిని దర్శించుకునే సమయంలో కచ్చితంగా శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని, ముఖానికి కచ్చితంగా మాస్కులు వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అధికార మంత్రి, పార్టీ ఎమ్మెల్యే, ఐపీఎస్, ఐఏఎస్, రెవెన్యూ శాఖ అధికారులు శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోలేదని, ముఖానికి పూర్తిగా మాస్కులు వేసుకోలేదని, కనీసం భౌతిక దూరం పాటించలేదని ఆలయానికి వెళ్లిన భక్తులు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

జిల్లాలో ఎక్కువ కరోనా కేసులు అక్కడే !
కర్ణాటకలోని మైసూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగానే నమోదు కావడంతో ఆ వ్యాధిని అరికట్టడానికి స్థానికుల సహాయంతో అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. మైసూరు జిల్లాలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది నంజనగూడు ప్రాంతంలోనే. ఇప్పుడు ఇలా అధికార పార్టీ నాయకులు, అధికారులు లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి ఇలా చేస్తే ఎక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications