ఎవ్వరూ తగ్గట్లేదు- లోక్సభ నిరవధిక వాయిదా
Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ప్రతిపక్షాలకు తిరుగులేని అస్త్రాన్ని అందించినట్టయిందీ ఉదంతం. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని వహిస్తోన్న ఇండియా బ్లాక్.. అమిత్ షా వ్యాఖ్యలపై దేశవ్యాప్త ఉద్యమం చుట్టేలా చేయడానికీ కారణమౌతోంది.
ప్రతిపక్షాలను ఉద్దేశించి సభలో అమిత్ షా ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాళ్లు పదే పదే అంబేద్కర్ పేరును జపిస్తోన్నారని, దీనికి బదులుగా ఏ దేవుడి పేరో తలచుకుంటే స్వర్గలోక ప్రాప్తయినా కలుగుతుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంబేద్కర్ వ్యతిరేకంగా కాంగ్రెస్పై ముద్రవేసే ప్రయత్నం చేశారాయన.

ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకం అయ్యాయి. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని, ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ను వినిపించాయి. కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం)తో పాటు అన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం నాడు ఉభయ సభలతో పాటు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి.
నేడు కూడా ఈ ఆందోళనలు కొనసాగాయి. లోక్సభ కార్యకలాపాలు ఆరంభం కావడానికి ముందు- పార్లమెంట్ ఆవరణకు ప్లకార్డులతో వచ్చారు ప్రతిపక్ష సభ్యులు. రాజ్యసభ, లోక్సభ ప్రతిపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డింపుల్ యాదవ్.. ఇతర ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శించారు.
అదే సమయంలో గురువారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద సంభవించిన తోపులాట సంఘటనపై అటు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం నిరసన ప్రదర్శనలకు దిగారు. పోటాపోటీ నినాదాలు చేశారు. దీనితో పార్లమెంట్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని తోసేశారనే ఆరోపణలపై రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది.
లోక్సభ ప్రారంభమైన తరువాత కూడా దీనికి బ్రేకులు పడలేదు. బయట ఎలాంటి సన్నివేశాలు కనిపించాయో.. లోపల కూడా అలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. అమిత్ షా క్షమాపణలు చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలాపాలు ముందుకు సాగనివ్వలేదు.
ఏ ఒక్కరు కూడా తమ స్థానాల్లో ఆసీనులు కాలేదు. లేచి నిల్చొని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. వారిని శాంతింపజేయడానికి స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పదేపదే ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ వినిపించుకోలేదు. బల్లలు చరుస్తూ, చప్పట్లు కొడుతూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ కనిపించారు. సభ నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్.












Click it and Unblock the Notifications