రాహుల్ అనర్హత రద్దయ్యేనా, తాజాగా - రాజ్యసభలో ఢిల్లీ బిల్లు, వైసీపీ మద్దతుతో..!!
పార్లమెంట్ సమావేశాల్లో నేటి నుంచి మరింత ఉత్కంఠ పెంచే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తరువాత రాహుల్ గాంధీ అనర్హత పైన స్పీకర్ తీసుకొనే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించనున్నారు. అదే సమయంలో లోక్ సభలో ఆమోదం పొందిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ బిల్లుకు బీజేడీ, వైసీపీ మద్దతు కీలకంగా మారింది.
రాహుల్ అనర్హత రద్దయ్యేనా:పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. మణిపూర్ పైన చర్చించాలి..ప్రధాని సమాధానం చెప్పాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నాయి. రెండు రోజుల విరామం తరువాత ఈ రోజు ప్రారంభమయ్యే సమావేశాల్లో రాజ్యసభలో ఢిల్లీ బిల్లుకు ఆమోదం, అవిశ్వాసం పైన చర్చ కీలకం కానున్నాయి. కొన్ని బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాలని భావిస్తోంది. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన శిక్ష పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో, రాహుల్ పైన అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం ఉత్కంఠగా మారుతోంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా రాహుల్ పైన అనర్హత నిర్ణయం ఉప సంహరించుకోవాలని కాంగ్రెస్ స్పీకర్ ను కోరింది.

స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ:రాహుల్ గాంధీపై అనర్హత ఎత్తివేస్తే అవిశ్వాస తీర్మానం పైన ఆయనతో మాట్లాడించాలని కాంగ్రెస్ భావిస్తోంది. రేపటి నుంచి సభలో అవిశ్వాసం పైన చర్చ ప్రారంభం కానుంది. గురువారం ప్రధాని మోదీ సభలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ రోజు స్పీకర్ ఓం బిర్లా కోర్టు తీర్పుకు అనుగుణంగా రాహుల్ పైన అనర్హత ఎత్తివేస్తూ నిర్ణయం ప్రకటిస్తే రాహుల్ గాంధీ ఈ రోజు నుంచే సభకు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు అవసరమైన దస్త్రం సిద్దమైనట్లు తెలుస్తోంది.
స్పీకర్ వెంటనే దీని పైన నిర్ణయం తీసుకుంటారా, మరి కొంత సమయం తీసుకుంటారా అనేదే ఇప్పుడు చర్చగా ఉంది. స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోకుంటే మరోసారి న్యాయస్థానం ఆశ్రయించేందుకు కాంగ్రెస్ సిద్దమవుతోంది.
రాజ్యసభలో ఢిల్లీ బిల్లు:అటు రాజ్యసభలో ఈ రోజు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. వెంటనే చర్చ చేపట్టాలని భావిస్తోంది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ, ఇండియాలకు దాదాపుగా సమాన బలమున్నా వైసీపీ, బిజూ జనతాదల్ వంటి పార్టీలు ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించాయి.
దీంతో రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బిల్లును ఇప్పటికే లోక్ సభ ఆమోదించింది. ఢిల్లీ బిల్లు నేపథ్యంలో తమ రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. సోమవారం తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ వారం పార్లమెంట్ వేదికగా అధికార - ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ రాజకీయం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications