పెట్రోల్,గ్యాస్ ధరల పెంపుపై దద్దరిల్లిన ఉభయసభలు: ప్రభుత్వంపై మండిపడ్డ విపక్షాలు
ఎల్పీజీ సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంపుపై పార్లమెంటు దద్దరిల్లింది. మంగళవారం లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాలు పెరిగిన ధరలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. సోమవారం రోజున కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విపక్షాలు వెంటనే పెంచిన ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేశాయి. విపక్ష పార్టీ సభ్యులను వెనక్కు వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలంటూ స్పీకర్ చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో సభను కాసేపు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలో కూడా సేమ్ సీన్ కనిపించింది.
మంగళవారం రోజున సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీ మాజీ మిత్ర పక్షమైన శిరోమని అకాలీదళ్, శివసేన ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక సభలో చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాలను టీవీల్లో చూపించడం లేదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను విపక్షాలు చుట్టుముట్టాయి. అయితే తమ స్థానాలకు వెళ్లాలని స్పీకర్ ఎంత చెప్పినప్పటికీ లెక్క చేయకుండా అక్కడే ఉండే నినాదాలతో హోరెత్తించారు విపక్ష పార్టీ సభ్యులు
ఇదిలా ఉంటే సోమవారం రోజున రెండో విడత పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా తొలిరోజున కూడా పెరిగిన పెట్రోల్ ధరలు, ఎల్పీజీ సిలిండర్ ధరలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన విపక్షాలు... అదే జోరును రెండో రోజు కూడా కొనసాగించాయి. తొలి రోజున సభ రెండు సార్లు వాయిదా పడింది. ఇక మంగళవారం కూడా సభకు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు పెట్రోలు ధరలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత 9 రోజులుగా పెట్రోలు ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి.
ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు. ఈ అంశంపై కూడా పార్లమెంటులో రగడ నడుస్తుండగానే మరోవైపు పెట్రోల్ ధరలపై కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసనలు తెలుపుతున్నారు. కోవిడ్ కారణంగా ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్సభ సమావేశాలను నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంగళవారం నుంచి ఉభయ సభలు ఉదయం 11 గంటలకే ప్రారంభం అయ్యాయి.